Amith Shah : అమిత్ షాపై ప్రతీకార కేసు?

Amith Shah :

కేంద్ర హోంమంత్రిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేస్తారా?

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని డీప్ ఫేక్ వీడియో కేసు వెంటాడుతున్న‌ వేళ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని మొఘల్ పురా పోలీస్ స్టేషన్ లో అమిత్ షాపై ఈ కేసు నమోదైంది. కాంగ్రెస్ పార్టీ నేత నిరంజన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

ఇటీవ‌ల హైదరాబాద్ పాతబస్తీలో అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లత మాట్లాడే వేళలో..

కొంతమంది చిన్నారుల్ని తన వద్దకు రమ్మంటూ అమిత్ షా సైగ చేశారని.. దీంతో వారు అమిత్ షా వద్దకు వెళ్లారు.

ఆ సమయంలో ఒక చిన్నారి చేతిలో ఉన్న ప్లకార్డులో కమలం పువ్వు గుర్తు ఉంది. ఇద్దరు చిన్నారుల చేతుల్లో ఆప్ కీ బార్ 400 సీట్స్ అంటూ రాసి ఉంది.

ఇలా ప్రచారం చేయటం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లుగా కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.

ఈ మేరకు ఎన్నికల కమిషన్ నిబంధనల్ని అమిత్ షా ఉల్లంఘించినట్లుగా ఈమొయిల్ ద్వారా కాంగ్రెస్ నేత‌లు ఫిర్యాదు చేశారు.

ఎన్నికల నియమావళిని బీజేపీ పట్టించుకోలేదని.. చిన్నారులతో ప్రచారం చేయించారని కంప్లైంట్ చేశారు.

చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది.

జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది.

దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి .. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు.

దీంతో అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

ఈ కేసులో ఏ1గా యమాన్ సింగ్.. ఏ2గా హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత.. ఏ3గా అమిత్ షా.. ఏ4గా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పేర్కొన్నారు.

అయితే సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీద కేసు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కేంద్ర హోంమంత్రిపై మీద కేసు పెట్టేంత ధైర్యం చేయ‌డం దేశ రాజ‌కీయాల్లోనే సంచలనం సృష్టిస్తోంది.

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దూకుడుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన పలువురి మీద కేసు నమోదు కావటంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ సైతం ఈ కేసును ఎదుర్కొంటున్నారు.

ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్ కు నోటీసులు జారీ చేయటం తెలిసిందే. దీంతో ఇప్పుడు ఢిల్లీ పోలీసులు సీఎం రేవంత్‌ను అరెస్ట్ చేస్తారా? లేక తెలంగాణా పోలీసులు అమిత్‌షాను అరెస్ట్ చేస్తారా అనే ఉత్కంఠ‌త నెల‌కొంది.

Also Read This Article : కుటుంబ పార్టీగా మారకూడదనే.. !

Dr. Chiranjeevi Gaaru Exclusive Interview
Dr. Chiranjeevi Gaaru Exclusive Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *