గుజరాత్ అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి లండన్ బయలుదేరిన ఫ్లయిట్ రన్వే నుంచి టేకాఫ్ అయిన క్షణాల్లోనే కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో దానిలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ దుర్ఘటనపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు.
పవన్ కల్యాణ్: అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 242 మందితో లండన్ బయలుదేరిన విమానం – టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోవడాన్ని ఊహించలేకున్నాము. వైద్య కళాశాల వసతి భవనాలపై కూలడంతో ఒక మహా విషాదంగా మిగిలింది. ఈ దుర్ఘటనలో మృతులకు దేశం బాసటగా ఉండాల్సిన సమయం ఇది.
నందమూరి బాలకృష్ణ: గుజరాత్ లో జరిగిన విమాన ప్రమాదం ఓ ఘోర దుర్ఘటన. మాటలకందని విషాదం. యావత్ జాతిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘోర ప్రమాదం లో భారతీయులతో పాటు విదేశస్తులూ మరణించడం బాధాకరం. ప్రయాణీకులతో పాటు సిబ్బంది..విమానం కూలినచోట మరికొందరు ప్రాణాలు కోల్పోవడం మనసును కలచివేస్తోంది.ఈ జాతీయ విపత్తులో ప్రతి ఒక్కరం కేంద్రానికి బాసటగా నిలుద్దాం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నా.