Atram Suguna :
ఆసక్తికరం.. ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సుగుణ ప్రస్థానం
అదిలాబాద్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికైన ఆత్రం సుగుణ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా (స్కూల్ అసిస్టెంట్ గా) విధులు నిర్వహిస్తున్న సుగుణ మరో 13 ఏళ్ల సర్వీస్ ఉండగానే ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడమే ఇందుకు కారణం. రాజకీయాలపై ఉన్న ఆసక్తితో ఈ నెల (మార్చి) 12న తన ఉపాధ్యాయ ఉద్యాగానికి ఆమె రాజీనామా చేశారు. టీచర్ కాకముందు ఆమె ఎంపీటీసీగా కూడా పనిచేశారు. ఆత్రం సుగుణ భర్త ఆత్రం భుజంగ్ కూడా ఉపాధ్యాయుడే. ఈమె తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంతో పాటు ఆదివాసీ, ఉపాధ్యాయ ఉద్యమాలలో కీలకంగా వ్యవహారించి పేరు సంపాదించుకున్నారు. కాగా, రాష్ట్ర మంత్రి సీతక్కతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఈమెకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ దక్కడానికి కలిసి వచ్చిందంటున్నారు. ఈమె గోండు గిరిజన తెగకు చెందినవారు. ప్రస్తుతం ఆత్రం సుగుణ ఆదివాసీ ఉమెన్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర సెక్రటరీగా, టీపీటీఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, ఆదిలాబాద్ జిల్లా మానవ హక్కుల ఫోరం ప్రధాన కార్యదర్శిగా, ఆదివాసీ, కల్చరల్ అండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ మహిళా విభాగపు కార్యదర్శిగా, అరుణోదయ కల్చరల్ ఫౌండేషన్ ఆదిలాబాద్ జిల్లా కో- కన్వీనర్ గా, ఇందిరా ఫిల్లోషిప్ ఆదిలాబాద్ జిల్లా గౌరవ సభ్యురాలుగా పదవులలో తన సేవలను అందిస్తున్నారు.2017 లో కొమురం భీమ్ త్యాగ సేవా పురస్కారం, 2018 లో జ్యోతిబాపూలే సేవా పురస్కారాలను ఆత్రం సుగుణ పొందారు.
Also Read This Article : కేజ్రీవాల్ అరెస్టు ద్వారా తప్పులో కాలేసిన బీజేపీ?

Also Read This Article : సికింద్రాబాద్ ఎంపీ పోటీ నుంచి దానం నాగేందర్ ఔట్?