...

ఫోన్ ట్యాపింగ్ కేసులో రంగంలోకి ఏసీబీ

Phone Taping Case :

వ్యాపారులను బెదిరించి నాటి అధికారుల అక్రమాస్తులు?

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో ఇక అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రంగంలోకి దిగనుంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు.. దాని ఆధారంగా భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నట్లు తెలుస్తుండడమే ఇందుకు కారణం. ఇకపై ఈ కేసులో ఏసీబీ ఆయా అధికారులపై ఫుల్ ఫోకస్ పెట్టి దర్యాప్తు చేసేందుకు సిద్ధమైంది.

ముఖ్యంగా..ఫోన్ ట్యాపింగ్ ద్వారా వ్యాపారులు, హవాలా ముఠాలను బెదిరించి వారి నుంచి అధికారులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లుగా విచారణ తేలినట్లు సమాచారం. ఈ డబ్బుతో భారీగానే ఆస్తులు కూడబెట్టుకున్నట్లు, విలాసవంతమైన విల్లాల్లో నివాసం ఉంటున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో ఈ వ్యవహారం ఏసీబీ చేతికి వెళ్లింది. వారు ఆ అధికారుల చిట్టాను బయటికి తీస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆఫీసర్ల ఆర్థిక పరిస్థితిని కూలంకశంగా విశ్లేషిస్తున్నారు.

 

ఎంతైనా మనం పోలీసులం.. మనం.. మనం ఒకటి

2018, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, ఉప ఎన్నికలు.. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే ఎక్కువగా ఫోన్ ట్యాప్ జరిగినట్లు అధికారులు నిగ్గు తేల్చారు. ఓ పార్టీకి చెందిన డబ్బులను ఈ ట్యాపింగ్ బ్యాచ్ రూట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇతర పార్టీలకు చెందిన డబ్బుల ఫ్లోటింగ్‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేసినట్లుగా తేలింది.

రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని ఆయన ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారో విన్నట్లు దర్యాప్తు అధికారుల దృష్టికి రాగా.. తాజాగా ఆస్తుల వ్యవహారం వెలుగుచూసింది. ఇప్పటికే ఈ కేసులో ఎస్‌ఐబీ డీఎస్పీ ప్రణీత్‌రావు, మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రణీత్‌రావు కస్టడీ ద్వారా కీలక విషయాలను రాబట్టడంలో దర్యాప్తు బృందం దూకుడుగా వ్యవహరిస్తోంది.

అయితే ఈ వ్యవహారంలో ఏ1 నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన అమెరికాలో ఉండటంతో పోలీసులకు ఒకింత కష్టమైంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ కేసు వ్యవహారంలో ప్రభాకర్ రావు పోలీసు ఉన్నతాధికారికి టచ్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి ఓ ఉన్నతాధికారికి ప్రభాకర్ రావు ఫోన్ చేసినట్లు సమాచారం. క్యాన్సర్ చికిత్స కోసం తాను అమెరికాకు వచ్చానని.. జూన్ లేదా జులైలో తిరిగి హైదరాబాద్ వస్తానని ఫోన్‌లో చెప్పారట.

‘ఇప్పుడు ప్రభుత్వం చెబితే మీరు ఎలా పనిచేస్తున్నారో అప్పుడు మేం కూడా ప్రభుత్వం చెబితే పనిచేశాం. ఎంతైనా మనం పోలీసులం.. మనం.. మనం ఒకటి. మా ఇళ్లల్లో ఎందుకు సోదాలు చేస్తున్నారు..?’ అని సదరు ఉన్నతాధికారిని ప్రభాకర్ రావు ప్రశ్నించారు. ఆయన చెప్పిన మాటలన్నీ విన్న ఆ ఉన్నతాధికారి.. ‘మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే అధికారిక మెయిల్‌కు పూర్తిగా సమాధానం రాసి పంపండి’ అని బదులిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్‌ రావుపై కేసు నమోదైన తర్వాత.. ఆయన అమెరికా వెళ్లిపోయారు. ఆయన ఆదేశాల మేరకే హార్డ్ డిస్కులను ప్రణీత్‌రావు ధ్వంసం చేసినట్లు విచారణలో నిగ్గు తేలింది. ప్రస్తుతం వాటిని రికవరీ చేసిన పోలీసులు.. డిస్కుల నుంచి సమాచారాన్ని రిట్రీవ్ చేస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ నేత కూడా :

విపక్ష నేతలు, అధికారులు, ఇతరుల ఫోన్లను అనధికారికంగా ట్యాపింగ్‌ చేయడానికి ప్రభాకర్‌రావు ఆదేశాలే కారణమని భుజంగరావు, తిరుపతన్న వాంగ్మూలమిచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారం వెనక బీఆర్‌ఎస్‌కు చెందిన ఓ కీలక నేత ఉన్నట్లు విచారణలో తేలిపోయింది. ఈ కేసులో అరెస్టయిన ముగ్గురు కీలక నిందితులు విచారణలో చెప్పిన పేరు ప్రభాకర్‌రావు. ఆయన ఆదేశాలతో విపక్ష నేతల ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు అంగీకరించినట్లు రిమాండ్‌ రిపోర్టు స్పష్టం చేస్తోంది.

ప్రభాకర్‌రావు కూడా పాత్రధారి అని దర్యాప్తు అధికారులు ఖరారు చేశారు. సూత్రధారులు ఎవరనేది తెలియాలంటే ప్రభాకర్‌రెడ్డి అరెస్టు కావాల్సిందేనని చెబుతున్నారు. ఆయనను విచారిస్తే ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ల ట్యాపింగ్‌ చేశారో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. ప్రధాన సూత్రధారులకు వ్యతిరేకంగా కేసు బలంగా ఉండాలంటే ప్రభాకర్‌రావు వాంగ్మూలం కీలకమని న్యాయనిపుణులు చెబుతున్నారు.

 

Also Read This Article : దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్ లింకు ను ఛేదించిన పంజాగుట్ట పోలిసులు..

 

ANANNYAA AKULAA
ANANNYAA AKULAA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.