‘మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరి.. మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి.. వెనుక వచ్చు వారికి బాట అయినది..’ అంటూ ‘అంకురం’ సినిమాలో అద్భుతమైన పాట ఒకటి ఉంది. దీని లిరిక్స్ ఎవర్ గ్రీన్. ఇప్పుడు ఇదెందుకంటే.. భారత్పై ముష్కరులు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. సరిహద్దులో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఉగ్రవాదులు సైలెంట్ అయినట్టు కనిపిస్తున్నారు.. అంతలోనే దాడికి సిద్ధపడుతున్నారు. ఉగ్రదాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పి కొడుతోంది. ఒకవైపు దేశం కోసం ప్రాణాలకొడ్డి సైన్యం పోరాడుతుంటే.. తమవారికి ఏమవుతుందోనని వారి కుటుంబాలు క్షణక్షణం భయం గుప్పిట్లో బతుకుతున్నాయి.
అలాంటి సైన్యానికి ఏదో ఒక భరోసా ఇవ్వగలిగితే వారు అంతకు మించిన ధైర్యంతో పోరాడగలుగుతారు. మోరల్ సపోర్ట్తో పాటు ఆర్థిక సపోర్ట్ కూడా ఇవ్వగలిగితే ఇంకా బాగుంటుంది. కానీ దాని కోసం నిన్నటి వరకూ ఈ విషయమై ఎవరూ ఆలోచించలేదు. ఇవాళ నిర్మాత అల్లు అరవింద్ రూపంలో అడుగు పడింది. ‘సింగిల్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్లో భాగంగా అల్లు అరవింద్.. తమ మద్దతు ఎప్పుడూ భారత సైనికులకు ఉంటుందని మోరల్ సపోర్ట్ ఇవ్వడమే కాకుండా.. ‘సింగిల్’ సినిమా వసూళ్ల నుంచి వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని మన సైనికులకు అందించనున్నట్టు వెల్లడించారు. ఈ అడుగు ఎంతో మందికి బాట కావాలని.. మన సైన్యానికి తగిన ఆర్థిక తోడ్పాటును అందించాలని ట్యాగ్ తెలుగు కోరుకుంటోంది. భారత్ మాతా కీ జై..
ప్రజావాణి చీదిరాల