టికెట్ ధరలు సినిమాలకు పెను విఘాతంగా మారాయి. ఈ క్రమంలోనే ఏదైనా సినిమా విడుదలవుతోందంటేనే టికెట్ ధరల గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ విషయమై కర్ణాటక కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా కూడా టికెట్ ధర మాత్రం రూ.200కు మించరాదని వెల్లడించింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. సింగిల్ స్క్రీన్స్తోపాటు మల్టీప్లెక్స్లకు సైతం ఇది వర్తించనుంది. ఈ విషయంలో అభ్యంతరాలకు 15 రోజుల సమయం ఇచ్చింది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2025-26 బడ్జెట్ ప్రసంగంలో కన్నడ చిత్ర పరిశ్రమ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్తో పాటు మల్టీప్లెక్స్లలో ప్రతి షో టికెట్ ధరనూ రూ.200కి పరిమితం చేస్తున్నట్టు ప్రకటించారు. ముఖ్యంగా వీకెండ్స్ రాగానే థియేటర్లు టికెట్ రేట్లను భారీగా పెంచేస్తున్నాయి. దీనిపై ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో టికెట్ ధరను రూ.200 పరిమితం చేస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. అయితే థియేటర్లలో పాప్కార్న్, ఇతర ఆహార పదార్థాలను తగ్గించాలనే డిమాండ్ కూడా ఉంది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.