‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ రేంజే మారిపోయింది. ఏకంగా నేషనల్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాల కోసం బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు. అలాంటి తరుణంలో కొద్ది రోజుల క్రితం ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అయ్యింది. అదేంటంటే.. అమీర్ ఖాన్తో కలిసి అల్లు అర్జున్ ఒక సినిమాలో నటించనున్నారంటూ తెగ ప్రచారం జరిగింది. దీనిని ప్రముఖ బాలీవుడ్ నిర్మాతతో కలిసి.. గీతా ఆర్ట్స్ నిర్మించబోతోందని సైతం వార్తలొచ్చాయి. తాజాగా ఈ వార్తలపై అమీర్ ఖాన్ స్పందించారు. ఇటీవల ఆయన నటించిన ‘సితారే జమీన్ పర్’ సినిమా విడుదలై మంచి సక్సెస్ సాధించింది.
ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. తనకు అల్లు అరవింద్ ఫ్యామిలీతో మంచి సంబంధాలున్నాయని.. తనకు ‘గజిని’ సినిమా వారితో కలిసి చేయడం వల్ల సాన్నిహిత్యం పెరిగిందన్నారు. బన్నీని అతను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నానని.. ‘గజిని’ సినిమాతో అతనితో మరింత సాన్నిహిత్యం ఏర్పడిందని తెలిపారు. సమయం వచ్చినప్పుడల్లా తామిద్దరం కలుస్తూనే ఉన్నామని.. ఆ కారణంగా తమ మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని తెలిపారు. అంతేకానీ తామిద్దరం కలిసి నటిస్తున్నామన్న వార్తల్లో ఎలాంటి నిజమూ లేదన్నారు. అసలు ఆ ఆలోచన కూడా తనకు లేదని.. ఎవరూ అలాంటి కథతో తమ ముందుకు రాలేదన్నారు. తామిద్దరం కలిసి దిగిన ఫోటో కారణంగానే అలాంటి వార్తలొచ్చాయని.. అవి చూసి తాము షాక్ అయ్యామని అమీర్ తెలిపారు. మున్ముందు తమ కాంబోలో సినిమా వస్తుందేమో చెప్పలేమన్నారు.