ప్రముఖ నటుడు చిరంజీవి తల్లిగారైన అంజనాదేవి తీవ్ర అస్వస్థతకు గురయ్యారంటూ ఇవాళ (మంగళవారం) ఉదయం నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. వీటిపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. తన తల్లి ఆరోగ్యం బాగానే ఉందని.. సోషల్ మీడియా వేదికగా అంజనాదేవి ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నాగబాబు ఖండించారు. ఎవరూ ఆందోళన చెందవద్దని అభిమానులను కోరారు. అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారని.. దీంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హుటాహుటిన హైదరాబాద్కు వచ్చారని.. చిరంజీవి సైతం షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఇంటికి వెళ్లారంటూ కొన్ని వార్తా ఛానళ్లలోనూ.. వెబ్సైట్స్లోనూ వార్తలొచ్చాయి. గతంలోనూ అంజనా దేవి ఆరోగ్యంపై అసత్య ప్రచారం జరుగగా అప్పట్లో చిరంజీవి స్పందించారు. తిరిగి ఇప్పుడు మరోసారి ప్రచారం జరిగింది.