సమంతకు ప్రొడ్యూసర్గా బాగానే కలిసొచ్చింది కానీ నటిగా మాత్రం అంతలా కలిసి రావడం లేదనే చెప్పాలి. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ కొన్నాళ్ల పాటు నటనకు దూరంగా ఉండిపోయింది. ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న తరుణంలోనే సమంత ‘ఖుషీ’ సినిమా చేసింది. ఇది అంతగా ఆమెకు కలిసి రాలేదు. ఆ తరువాత ‘సిటాడెల్’ చేసింది. ఇది కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఆ తరువాత ‘రక్త్ బ్రహ్మాండ్’ను ప్రారంభించింది. ఇది కూడా అమ్మడికి కలిసి రావట్లేదని తెలుస్తోంది. ఎందుకంటే దీనికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. మొత్తానికే ఇది ఆగిపోయిందని టాక్. కొన్నాళ్ల క్రితం ఈ సిరీస్కి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి కోట్ల రూపాయల బడ్జెట్ విషయంలో అవతవకలకు పాల్పడ్డాడట. దీంతో 25 రోజుల షూటింగ్తోనే బడ్జెట్ మొత్తం అయిపోయిందట. ఇదంతా ఆడిట్ ద్వారా బయటపడటంతో అకౌంటింగ్లో అక్రమాలేవో జరిగినట్టు గుర్తించి మొత్తానికే షూటింగ్ను ఆపివేశారని సమాచారం. చిత్ర నిర్మాతలైన రాజ్-డీకే మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు. ఒకవేళ నిజమైతే మాత్రం సమంతకు గడ్డు కాలం నడుస్తున్నట్టే.