చిత్రం: థగ్ లైఫ్
విడుదల తేదీ: 05-06-2025
నటీనటులు: కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామి, నాజర్, తనికెళ్ల భరణి, ఐశ్వర్య లక్ష్మీ, అశోక్ సెల్వన్, జోజు జార్జ్
దర్శకుడు: మణిరత్నం
నిర్మాత: కమల్ హాసన్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
సంగీతం: ఏఆర్ రెహమాన్
మణిరత్నం దర్శకత్వాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారు. గతంలో వచ్చిన ఆయన సినిమాలు ప్రేక్షకులను ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంజలి, గీతాంజలి, రోజా, దళపతి, బొంబాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు చేశారాయన. ఇక కమల్ హాసన్, మణిరత్నం కలయిక అంటే ఒక మేజిక్ చేస్తారన్న భావన ప్రేక్షకుల్లో ఉంటుంది. వీరిద్దరి కాంబోలో 1987లో ‘నాయకన్’ వచ్చింది. 38 ఏళ్ల తర్వాత ‘థగ్ లైఫ్’ సినిమా వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తిరిగి మణిరత్నం, కమల్ హాసన్ మ్యాజిక్ చేశారా? చూద్దాం.
అసలు కథేంటంటే..
రంగరాయ శక్తిరాజు (కమల్హాసన్) ఢిల్లీలో ఒక పెద్ద గ్యాంగ్ స్టార్. అమర్ (శింబు) తండ్రి అతని చిన్న వయసులోనే శక్తిరాజు గ్యాంగ్కి, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో చనిపోతాడు. అమర్ చెల్లి కూడా ఆ సమయంలోనే మిస్ అవుతుంది. అమర్ని అడ్డు పెట్టుకుని శక్తిరాజు పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. ఆ సానుభూతితో అమర్ని పెంచి పెద్ద చేస్తాడు. అమర్ కూడా శక్తిరాజుకు కుడిభుజంలా మెలుగుతాడు. శక్తిరాజు ఆధిపత్యాన్ని అన్నయ్య (నాజర్) సహించలేకపోతాడు. ఈ క్రమంలోనే అమర్ను మిస్గైడ్ చేసి.. శక్తిరాజును చంపేందుకు స్కెచ్ గీస్తాడు. ఆ తరువాత ఏం జరుగుతుంది? సినిమా ఎలాంటి మలుపు తీసుకుంటుంది? వంటి అంశాలను సినిమాలో చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..
గ్యాంగ్స్టర్ డ్రామాలు చాలానే వచ్చాయి. అంతెందుకు నాయకన్ కూడా అదే కోవకు చెందినదే. గ్యాంగ్స్లో అంతర్గత కుమ్ములాటల్ని కూడా బలమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా మలచవచ్చు. కానీ ఈ సినిమాలో అలాంటివేం కనిపించవు. అసలు గ్యాంగ్స్టర్ డ్రామాకు బలమైన విలన్ ఉండాలి. కానీ ఈ సినిమా మహాభారతం మాదిరిగా వాళ్లలో వాళ్ల మధ్యే కుమ్ములాటలు. కొత్తదనం అంటూ ఏమీ ఉండదు. సినిమా మాత్రం ముగ్గురు, నలుగురు మధ్యే నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా సినిమా పర్వాలేదన్నట్టుగా సాగుతుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా చాలా బోరింగ్గా అనిపిస్తుంది. ఇంట్రవెల్ బ్యాంగ్ కూడా మన ఊహలకు అతీతంగా ఏమీ ఉండదు. ఆ తరువాత కథంతా రొటీన్. ప్రతి ఒక్కరూ ఊహించినట్టుగానే ఉంటుంది. స్లో నెరేషన్ విసుగు పుట్టిస్తుంది. సినిమాలో అద్భుతమైన తారాగణాన్ని తీసుకున్నారు. కానీ ఆయా పాత్రలకు పెద్దగా ప్రాధాన్యమే ఇవ్వలేదు. త్రిష పాత్ర ఒకింత ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా.. ఫ్యాన్స్కు ఇలాంటి పాత్రను ఎందుకు ఎంచుకుందా? అని బాధగా కూడా అనిపించవచ్చు.
ఎవరెలా చేశారంటే..
కమల్ హాసన్ ఎప్పటి మాదిరిగానే నట విశ్వరూపం ప్రదర్శించారు. శింబు కూడా తన పాత్రలో జీవించాడు. త్రిష, అభిరామి తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. నాజర్కు మంచి పాత్రే దక్కింది. కానీ తనికెళ్ల భరణి, వడివుక్కరసి, జోజు జార్జ్, అలీ ఫజల్ వంటి అద్భుతమైన తారాగణాన్ని ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయారు.
టెక్నికల్ పరంగా సినిమా ఎలా ఉందంటే..
ఏఆర్ రెహమాన్ సంగీతం అంటే ప్రేక్షకులు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ వారి అంచనాలను అందుకునేలా అయితే సంగీతం లేదనే చెప్పారు. ఎడిటింగ్ విషయంలోనూ మరింత శ్రద్ధ వహిస్తే బాగుంటుందనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ అంతగా మెప్పించదు.
బోటమ్ లైన్: కొత్త సీసాలో పాత సారా
రేటింగ్: 2.25/5
ప్రజావాణి చీదిరాల
