అల్లు అర్జున్ హీరోగా, అనూ మెహతా హీరోయిన్గా రూపొందిన చిత్రం ‘ఆర్య’. సుకుమార్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన ఎందుకంటే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 21 ఏళ్లవుతోంది. ఈ సినిమా 2004 మే 7న విడుదలైంది. ఒకరకంగా చెప్పాలంటే అల్లు అర్జున్ జీవితాన్ని మార్చేసిన సినిమా ఇది. 2004 మే 7, న ‘ఆర్య’ మార్నింగ్ షో పడింది. వన్ సైడ్ లవ్ కాన్పెప్ట్తో రూపొందిన ఈ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ‘ఫీల్ మై లవ్’ ఫీవర్తో ప్రేక్షకులు ఊగిపోయారు. హీరో క్యారెక్టర్పై మిశ్రమ స్పందన.
అయితే ఇదంతా కేవలం మొదటి రెండు రోజులు మాత్రమే. కట్ చేస్తే సినిమా 125 రోజుల పాటు టాలీవుడ్లో ట్రెండ్ సెట్ చేసింది. ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 2003 నవంబర్ 19న సినిమా లాంఛనంగా ప్రారంభమైన ‘ఆర్య’ను సుక్కు కేవలం 120 రోజుల్లో పూర్తి చేశారు. 120 రోజుల పాటు తీయించిన సినిమా.. 125 రోజులు ఆడటం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ ‘ఫీల్ మై లవ్’ అంటూ ఇచ్చిన మ్యూజిక్ యూత్కు మ్యాజిక్లా పని చేసింది. ప్రతి ప్రేమికుడు ఆ ప్రేమను ఫీలవడమే కాకుండా.. ‘తకదిమితోం’ అంటూ చిందులు తొక్కాడు. ప్రతి పాటా యూత్ మైండ్లోకి బుల్లెట్లా దూసుకుపోయింది. ‘అ అంటే అమలాపురం.. ఆ అంటే ఆహాపురం’ అంటూ అక్షరమాలకు దేవి కొత్త అర్థం చెప్పారు.
ఇక అలా రూ.4 కోట్లతో నిర్మించి రిలీజ్ చేసిన సినిమా ఏకంగా రూ.30 కోట్లు వసూలు చేసి నిర్మాతకు కాసుల పంట పండించింది. ఇక మలయాళంలో డబ్ చేసి విడుదల చేస్తే.. రూ.35 లక్షల వరకూ వసూలు చేసి పెట్టింది. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ కాస్త కేరళ ప్రేక్షకుల మల్లు అర్జున్గా మారిపోయాడు. నిజానికి ‘గంగోత్రి’ ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన అల్లు అర్జున్ తన తొలి సినిమాకు, రెండో సినిమాకు గుర్తు పట్టలేనంతగా అతడు మారిపోయాడు. ‘ఆర్య’ సినిమా అల్లు అర్జున్లోని స్టైలిష్ స్టార్ని పరిచయం చేసింది. ‘గంగోత్రి’లో అమాయకుడైన ఓ అబ్బాయి ‘ఆర్య’కు వచ్చేసరికి చలాకీ కుర్రాడిలా మారిపోయాడు. యాక్టింగ్, డ్యాన్సింగ్ స్కిల్స్ అన్నీ బయటపెట్టి యూత్లో స్టార్గా అల్లు అర్జున్ను ‘ఆర్య’ నిలబెట్టడమే కాకుండా అల్లు అర్జున్ కెరియరే ఈ చిత్రంతో మారిపోయింది.
ప్రజావాణి చీదిరాల