‘పుష్ప2’ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ క్రమక్రమంగా కోలుకుంటున్నాడు. ఈ క్రమంలోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయి రీ హాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాడు. నేడు (సోమవారం) శ్రీతేజ్ను అల్లు అరవింద్.. బన్నీ వాసుతో కలిసి వెళ్లి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ తేజ్ కోలుకోవటం కోసం తమ కుటుంబమంతా ఆశగా ఎదురుచూస్తోందన్నారు. శ్రీతేజ్ రోజురోజుకూ కోలుకుంటున్న విషయం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. శ్రీ తేజ్ చికిత్సకు సహకరిస్తున్నాడని వైద్యులు చెప్పినట్టు తెలిపారు. త్వరలోనే శ్రీ తేజ్ మనందరి మధ్య సాధారణ పిల్లల్లా ఉంటాడని ఆశాభావాన్ని అరవింద్ వ్యక్తం చేశారు. ఇప్పటికే శ్రీతేజ్ అకౌంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ‘పుష్ప’ యూనిట్ రూ.2 కోట్లు వేసింది.
శ్రీతేజ్ పరిస్థితి మాత్రం కొంతమేర అయితే బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఎవ్వరినీ గుర్తించే పరిస్థితిలో ఆ చిన్నారి లేడని సమాచారం. గతంతో పోలిస్తే కేవలం 15 శాతం మాత్రమే మెరుగైందని తెలుస్తోంది. ఇక రిహాబిలిటేషన్లో సెంటర్లో ఫిజియోథెరపీ చేస్తే కొంతమేర ప్రయోజనం ఉండొచ్చని వైద్యులు అంటున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడగా.. అతని తల్లి రేవతి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అల్లుఅర్జున్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించడంతోఈ ఘటన దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.
ప్రజావాణి చీదిరాల