KCR: ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన కేసీఆర్.. ఇంట్రస్టింగ్‌గా తెలంగాణ పాలిటిక్స్

అలలా ప్రత్యర్థి పార్టీపై విరుచుకుపడే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సడెన్‌గా సైలెంట్ అయ్యారు. ఒక్కసారి కేసీఆర్ స్టేజ్ ఎక్కారంటే తన మాటల ఝరితో సామాన్యులనే కాదు ప్రత్యర్థులను సైతం అలా లీనమైపోయి తన ప్రసంగాన్ని వినేలా చేయగలిగే దిట్ట. ఆయన పుస్తక, భాషా జ్ఞానం ఆ స్థాయిలో ఉంటుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత ఆయన పెద్దగా ప్రజల ముందుకు వచ్చింది లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావులను ముందుంచి పార్టీని నడిపించారు. మధ్యలో అడపా దడపా బయటకు వచ్చినా కూడా అది నామమాత్రమే. పూర్తి స్థాయిలో బయటకు వచ్చింది లేదు. కేసీఆర్ బయటకు రాకపోవడంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆయన పని ఇక అయిపోయిందని కూడా అన్నారు. అయినా సరే.. ఎందుకో కేసీఆర్ ఇంటికే పరిమితమయ్యారు. ఇక తాజాగా ఆయన ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బహిరంగసభలో కేసీఆర్‌ అధికార పార్టీని ఏకిపారేశారు.

కాడి దింపిన కార్యకర్తలు..

విజయ గర్వం అనేది ఎంతటి వారినైనా పతనం అంచుకు చేరుస్తుంది. వాస్తవానికి రెండు సార్లు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇక మీదట కొన్ని దశాబ్దాల పాటు బీఆర్ఎస్‌కు తప్ప వేరొక పార్టీకి తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్. విజయ గర్వం ఆ పార్టీని ముంచేసింది. రాజకీయ విశ్లేషకులు సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం. కానీ వారెప్పుడూ జెండా మోసేవారుగానే చూస్తే ఏ పార్టీ మనుగడకైనా ప్రమాదమే. ఒక్కసారి కార్యకర్తలు కాడి దింపారో పార్టీ పరాజయం ఫిక్స్. ఇదే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ విషయంలో జరిగింది. రెండోసారి విజయం తర్వాత కేసీఆర్ కానీ.. ఆ పార్టీ అగ్రనేతలు కానీ పార్టీ కార్యకర్తలను పట్టించుకున్న పాపాన పోలేదు. అగ్ర నేతలకు తప్ప సామాన్యులకు ప్రగతి భవన్ వైపు చూసే అవకాశం కూడా ఇవ్వలేదు. పైగా ఆది నుంచి బీఆర్ఎస్‌కు అండగా నిలిచిన వారిని వదిలేసి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పెద్ద పీట వేశారు. ఇది కాస్త కార్యకర్తల్లోనూ మండల స్థాయి నేతల్లోనూ తీవ్ర అసహనాన్ని రేకెత్తించింది. దీంతో పార్టీకి అంతకాలం పాటు బలంగా నిలిచిన కార్యకర్తలు, మండల స్థాయి నేతలే సైడ్ అయిపోయారు.

అసలు విషయాన్ని మరిచిన కేసీఆర్..

రాజకీయాల్లో సమ ఉజ్జి ఉంటేనే బాగుంటుంది. కేసీఆర్ రంగంలోకి దిగితేనే తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతాయి. తాజాగా జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవాలను పరిశీలిస్తే కేసీఆర్ ఫుల్ ఫామ్‌లోకి వచ్చినట్టు అనిపించింది. కాంగ్రెస్ పార్టీని ఏకి పారేసిన తీరు చూసినా కూడా అది అవగతమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు.. నెరవేర్చినవెన్నీ లెక్కి తీసి మరీ దునుమాడారు. తెలంగాణకు ఎప్పటికీ విలన్ కాంగ్రెస్ పార్టీయేనని తేల్చేశారు. కానీ తెలంగాణను కాంగ్రెస్ పార్టీయే ఇచ్చిన విషయాన్ని కేసీఆర్ విస్మరించారు. తెలంగాణ ఇచ్చి ఏపీకి విలన్ అయింది తప్ప తెలంగాణకు కాదు. కొన్ని విషయాల్లో కేసీఆర్ ఆచితూచి మాట్లాడాలి. అలాగే ఇప్పటికైనా కార్యకర్తలు, మండల స్థాయి నేతలకు భరోసానిస్తే పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం దిశగా పయనించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *