బాధ్యతకు బ్రాండ్ అంబాసిడర్గా అనిపిస్తుంది సాయిపల్లవి. చక్కని చీరకట్టుతో ఎక్కడా ఎక్స్పోజింగ్కు తావివ్వకుండా తన పనేంటో తాను చూసుకుని వెళ్లిపోతుంది. అమ్మడికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందరు హీరోయిన్ల మాదిరిగా కాకుండా సాయిపల్లవిని గౌరవంతో చూస్తారు. ఒకప్పుడు అంటే ‘విరాటపర్వం’ సినిమా సమయంలో కశ్మీర్ పండితులపై దాడి జరిగింది. ఆమె దానిని గోవధకు అనుసంధానిస్తూ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అప్పట్లో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా కశ్మీర్లో దాడి జరిగింది. అమాయక జనాలపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. నరమేధం సృష్టించారు. దీనిపై యావత్ భారత్ స్పందించింది. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులతంతో ఈ ఘటనను ఖండించారు.
టాలీవుడ్ నుంచి ఎందరో ప్రముఖులు ఈ ఉగ్రదాడిని నిరసిస్తూ పోస్టులు పెట్టారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ క్రమంలోనే సాయిపల్లవి సైతం దాడి ఘటనను ఖండిస్తూ పోస్ట్ పెట్టింది. ‘‘పహల్గాం దాడిలో జరిగిన నష్టం, బాధ, భయం నాకు వ్యక్తిగతంగా అనిపిస్తాయి. చరిత్రలో జరిగిన భయంకరమైన నేరాల గురించి తెలుసుకోవడమే కాకుండా ఇప్పటికీ అలాంటి అమానవీయ చర్యలకు సాక్షిగా ఉండటం వల్ల ఏమీ మారలేదని చూపిస్తుంది. మారుతుందన్న ఆశను సైతం మానవ మృగాలు తుడిచి పెట్టేశాయి. కుటుంబంతో ఆనందకరమైన క్షణాలను పొంది వాటిని పదిలపరుచుకోవాలనుకున్నవారు అచేతన స్థితిలో కుటుంబం కళ్లెదుటే కుప్పకూలిపోవడం చూస్తున్న దృశ్యాలు నన్ను కలచివేస్తున్నాయి. నిస్సహాయంగా, శక్తిహీనురాలిగా.. కోల్పోయిన అమాయక జీవితాలు, బాధిత కుటుంబాలకు మనశ్శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’’ అంటూ సాయిపల్లవి ట్వీట్ చేసింది.
ప్రస్తుతం నెటిజన్లతో వచ్చిన సమస్య ఏంటంటే.. ట్వీట్ చేయకపోతే ఇంత ఘటన జరిగినా ట్వీట్ చేయలేదంటారు. చేస్తే.. ఎప్పటివో తవ్వి తీసి మరీ అప్పుడలా.. ఇప్పుడిలా అంటూ కామెంట్స్ పెడతారు. సాయి పల్లవి పాత వీడియోలను తీసి మరీ విమర్శించాల్సిన అవసరం ఏంటి? అప్పుడైనా.. ఇప్పుడైనా వ్యక్తిగత అభిప్రాయం చెప్పే రైట్ ఆమెకు ఉంది. దానిని విమర్శించే హక్కు ఎవరికీ లేదు. కొందరు మాత్రం సాయపల్లవికి మద్దతుగా నిలుస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల