ప్రియదర్శి, రూపా కొడువయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణంలో మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ముచ్చటించారు. ‘‘యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ, లవ్ వంటి అన్ని అంశాల కలబోతగా ‘సారంగపాణి జాతకం’ ఉంటుంది. ఇంద్రగంటి గారు కథను చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. థియేటర్లో అందరూ హాయిగా నవ్వుకునేలా ఓ ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ చేయాలనే లోటు ఈ చిత్రంతో తీరిపోయింది. జంధ్యాల గారితో ఇలాంటి ఓ పూర్తి వినోదాత్మక సినిమా చేయాలనే కోరిక ఉండేది. ఆ లోటు ఈ సినిమాతో తీరిపోయింది.
‘జెంటిల్ మాన్, సమ్మోహనం’ తరువాత మా కాంబోలో హ్యాట్రిక్ హిట్ రాబోతోంది. సినిమాను ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని తీశాం. సరైన థియేటర్లు దొరకాలనే ఉద్దేశంతో పాటు మంచి సీజన్ దొరకాలనే ఇప్పటి వరకు ఆగాం. సమ్మర్ హాలీడేస్ ప్రారంభమవడంతో ఇదే మంచి సీజన్ అనుకుని మేం ఏప్రిల్ 25న వస్తున్నాం. సినిమాను ఇప్పటికే చాలా మందికి చూపించడంతో అద్భుతంగా ఉందని చెప్పారు. సినిమా ఫస్టాఫ్ పూర్తి వినోదాత్మకంగానూ.. ద్వితీయార్థం నెక్ట్స్ లెవల్లోనూ ఉంటుంది. జాతకం చుట్టూ తిరిగే ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా, సస్పెన్స్గా ఉంటుంది. అలాగని సినిమా ఊహలకు అందకుండా ఏమీ ఉండదు. హాయిగా ఎంటర్టైన్ చేసేలా ఉంటుంది. క్యారెక్టర్లన్నీ ఏదో ఇరికించినట్టుగా కాకుండా కథలో భాగంగా వస్తాయి. వెన్నెల కిషోర్, వైవా హర్ష, నరేష్ గారు, అవసరాల శ్రీనివాస్ గారు ఇలా అన్ని కారెక్టర్లు అద్భుతంగా నవ్విస్తాయి.
ఈ కథ విన్నాక దర్శి అయితే బాగుంటుందని మేం అనుకున్నాం. ‘కోర్ట్’ మూవీలో ఆయన సీరియస్గా కనిపిస్తే ఈ సినిమాలో నవ్విస్తారు. అప్పట్లో మేం ఒక హీరోతో చేసిన తరువాత ఇంకో హీరోతో సినిమాను ప్లాన్ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు ఒక్కొక్కరు నాలుగైదు ప్రాజెక్టులని లైన్లో పెట్టేసి అంతా కాంబినేషన్స్ చుట్టూ తిరుగుతూ కథల గురించి పట్టించుకోవడం లేదు. నాకు సినిమాల పట్ల ఎక్కువ ప్యాషన్ కాబట్టి ఏ సినిమా చేసినా నా మార్క్ ఉండాలని కోరుకుంటా. ప్రస్తుతం ఉన్న ట్రెండ్కు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని మల్చాలని అనుకున్నాం. అనుకున్నట్టుగా జంధ్యాల గారి కామెడీ, ఈవీవీ గారి స్టైల్, ఇంద్రగంటి మార్క్ ఇలా అన్నీ ఉండేలా.. ప్లాన్ చేశాం. ప్రస్తుతం కొన్ని కథలు చర్చిస్తున్నాం. సీక్వెల్స్ అంటే నాకు భయం కాబట్టి వాటి జోలికి వెళ్లను’’ అన్నారు.