Rajendra Prasad: ‘ప్రేమించు పెళ్ళాడు’ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా

‘లేడీస్ టైలర్’ కపుల్ రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘షష్టిపూర్తి’. ఈ చిత్రంలో రూపేష్, ఆకాంక్షా సింగ్ హీరో, హీరోయిన్లుగా నటించారు. పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ కార్యక్రమం ఇవాళ (శనివారం) జరిగింది. ఈ కార్యక్రమంలో ఇళయరాజా, కీరవాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేందప్రసాద్ మాట్లాడుతూ, ‘‘నేను ఇళయరాజా గారిని స్వామి అని పిలిచేవాడిని. అలాంటి ఇళయరాజా తన సంగీతంతోనే చాలామందిని హీరోలని చేశారు. ఈ క్రమంలోనే నా తొలి చిత్రం‘ప్రేమించు పెళ్ళాడు’కి ఆయన సంగీతాన్ని అందించారు. ‘ప్రేమించు పెళ్ళాడు’ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా. అయితే నాకు ‘లేడీస్ టైలర్’ ప్రాణం పోసింది. ఒకవేళ ‘లేడీస్ టైలర్’ కూడా ఆడకపోతే ఆత్మహత్య చేసుకునేవాడినేమో. ఇళయరాజా సంగీతం వల్లే ఆ సినిమా హిట్టయింది.

‘లేడీస్ టైలర్’ డబుల్ పాజిటివ్ చూసిన ఇళయరాజా నన్ను తీసుకొస్తేనే రీ-రికార్డింగ్ చేస్తానని అనడంతో షూటింగ్‌లో గాయపడి వున్నప్పటికీ, అలాగే ఇళయరాజా గారి దగ్గరకి వెళ్ళాను. నన్ను మొదటిసారి చూసిన ఇళయరాజా ‘రా’ అని పిలిచారు. చాలా బాగా నటించావు అన్నారు. నీ యాక్టింగా, నా రీ-రికార్డింగా తేల్చుకుందాం అన్నారు. ఆ తరువాత నన్ను థియేటర్లోనే కూర్చోపెట్టి రీ రికార్డింగ్ చేశారు. అలాంటి మా ‘స్వామి’ ఇంతకాలానికి నా సినిమాకి సంగీతాన్ని అందించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. కీరవాణి గారు పాట రాశారంటేనే ఈ సినిమా ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. కీరవాణి గారితో కూడా నాకు ఎంతో అనుబంధం వుంది. ఆయన వందవ సినిమా కూడా నా ‘రాంబంటు’ కావడం విశేషం. నేను నిజ జీవితంలో ‘షష్టిపూర్తి’ చేసుకోలేదు. నాకు నట జీవితంలో ‘షష్టిపూర్తి’ వచ్చింది. చక్కటి కథతో రూపొందిన సినిమా ఇది’’ అన్నారు. ఈ సందర్భంగా ఇళయరాజా పాదాలకు రాజేంద్రప్రసాద్ నమస్కరించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *