Indian Cricket :
తమ అభిమాన ఆటగాడి విన్యాసాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకున్న తెలుగు అభిమానులకు నిరాశే మిగిలింది.
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా గురువారం నుంచి హైదరాబాద్లో తొలి టెస్టు ప్రారంభం కానుండగా..
మొదటి రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండటం లేదని టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు.
వ్యక్తిగత కారణాల వల్ల సిరీస్లోని తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరమైనట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించాడు.
సిరీస్లో భాగంగా తొలి టెస్టుకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తుండగా.. రెండో మ్యాచ్ విశాఖపట్నంలో జరగనుంది.
దీంతో.. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్లోని కోహ్లీ అభిమానులకు కింగ్ కోహ్లీ ఆట చూసే చాన్స్ మిస్ అయింది.
దేశమే తొలి ప్రాధాన్యత.. కానీ!
ఈ సిరీస్లో భాగంగా తొలి రెండు టెస్టుల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే జట్టును ప్రకటించగా.. తాజాగా కోహ్లీ నిర్ణయంతో దాన్ని తిరిగి సవరించారు.
‘కెప్టెన్ రోహిత్ శర్మ, టీమ్ మేనేజ్మెంట్, సెలెక్టర్లతో కోహ్లీ ఈ విషయం గురించి చర్చించాడు.
దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడూ తన మొదటి ప్రాధాన్యత అని.. అయితే వ్యక్తిగత తప్పని పరిస్థితి కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించాడు.
కోహ్లీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. అతడి ప్రైవసీకి భగం కల్పించవద్దని కోరుతున్నాం’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇటీవల స్వదేశంలో అఫ్గానిస్థాన్తో జరిగిన టీ20 సిరీస్లోనూ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల తొలి మ్యాచ్కు దూరమైన విషయం తెలిసిందే. అయితే
అప్పుడలా.. ఇప్పుడిలా!
సుదీర్ఘ ఫార్మాట్ను అత్యంత ఇష్టపడే విరాట్ కోహ్లీ.. టెస్టు క్రికెట్లో దేశానికి ప్రాతినిధ్యం వహించడమే అత్యంత గౌరవమని గతంలో పలుమార్లు వెల్లడించాడు.
సొంతగడ్డపై జరుగుతున్న ఈ సుదీర్ఘ సిరీస్తో కోహ్లీ మరిన్ని రికార్డులు తన పేరిట లిఖించుకుంటాడని.. అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో అతడు అందుబాటులో ఉండటం లేదని తేలింది.
విరాట్ కోహ్లీ చివరిసారిగా 2021లో ఈ మాదిరిగి టెస్టు సిరీస్ నుంచి విరామం తీసుకున్నాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టు అనంతరం కోహ్లీ పితృత్వ సెలవుపై స్వదేశానికి తిరిగి వచ్చాడు.
కోహ్లీ-అనుష్క జంటకు 2021లో వామిక జన్మించింది. ఆ సమయంలో అజింక్యా రహానే జట్టుకు సారథ్యం వహించగా.. తొలిసారి టీమ్ఇండియా.. ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ విజయం సాధించింది.
ప్రస్తుతం కోహ్లీ సతీమణి అనుష్క శర్మ రెండోసారి తల్లి కాబోతున్న నేపథ్యంలోనే కోహ్లీ సిరీస్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు.
ప్రస్తుతానికి కోహ్లీ స్థానంలో సెలెక్టర్లు మరే ఆటగాడిని ఎంపిక చేయలేదు. దేశవాళీల్లో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ ఖాన్తో పాటు..
ఇంగ్లండ్ లయన్స్తో అనధికారిక టెస్టు సిరీస్లో సత్తాచాటిన రజత్ పాటిదార్లో ఒకరిని ఎంపిక చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
Also Read : UCC bill : ఆ రాష్ట్రంలో అత్యంత వివాదాస్పద బిల్లు
