Revanth Reddy :
పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ వినూత్న ప్రచారం
వినడానికి వింతగా ఉంది కదూ! కానీ, పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు ఇలా గాడిదలతో గుడ్లు పెట్టిస్తున్నాయి.
కాంగ్రెస్, బీజేపీ నేతలు పోటాపోటీగా గాడిద గుడ్లను ప్రచారం చేస్తున్నారు. వీటిని చూస్తున్న జనం మాత్రం ఆశ్చర్యపొతున్నారు. అసలు విషయమేంటంటే.. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వలోని కేంద్ర ప్రభుత్వం పదేళ్ల పాలనలో తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని పేర్కొంటూ.. వారు ఇచ్చింది గాడిద గుడ్డేనంటూ కాంగ్రెస్ తొలుత ఈ ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఎన్ఎస్ యూ ఐ ఆధ్వర్యంలో మొదలుపెట్టిన ఈ ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకొని తన ప్రచారంలో దీనిని ప్రదర్శిస్తున్నారు. గాడిద గుడ్డు బొమ్మను తయారు చేయించి.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో తెలంగాణకు ఇచ్చింది ఇదేనంటూ బహిరంగ సభలకు వచ్చిన జనాలకు వివరిస్తున్నారు.
ఇది జనాల్లోకి బాగా వెళుతుండడంతో ప్రతి సభలోనూ రేవంత్ దీనిని కొనసాగిస్తున్నారు. అయితే తొలుత దీనిని తేలిగ్గా తీసుకున్న బీజేపీ నేతలు.. ప్రజల నుంచి దీనిని బాగా స్పందన వస్తుండడంతో అప్రమత్తమయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. దీనిపై రేవంత్ రెడ్డిని తీవ్రంగా తప్పుబట్టారు. తనకు తెలిసి గాడిద గుడ్లు పెట్టదని, కానీ.. రేవంత్ రెడ్డి మాత్రం గాడిదతో గుడ్లు పెట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ దిగజారుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అయినా.. కాంగ్రెస్ దీనిని ఆపకపోవడంతో.. చివరికి బీజేపీ కూడా అదే దారిలోకి మళ్లింది. తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ పై, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడిద గుడ్డులాగానే ఉందన్నారు. తద్వారా ఆయన కూడా కాంగ్రెస్ దారిలోకి వచ్చారు. ఎన్నికల ప్రచారానికి వారం రోజుల గడువు ఉన్నందున.. గాడిదలు ఇంకెన్ని గుడ్లు పెడతాయో చూడాలి.
Also Read This Article : కుటుంబ పార్టీగా మారకూడదనే.. !
