PM Modi :
ప్రచారంలో దేవుళ్ల పేరును వాడుతున్నారంటూ ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా నిషేధం విధిస్తారా? కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు కానీ.. మోదీపై అనర్హత వేటు వేయాలనే పిటీషన్ ఒకటి ఢిల్లీ హైకోర్టులో దాఖలైంది.
హైకోర్టు కూడా దీన్ని విచారణకు స్వీకరించింది. శుక్రవారం ఈ పిటీషన్ విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ.. వాయిదా పడింది.
ఈ నెల 29వ తేదీన అంటే సోమవారం ఈ పిటీషన్ ఢిల్లీ హైకోర్టు సమక్షానికి విచారణకు రానుంది.
ఈ పిటీషన్ను విచారించాల్సి ఉన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సచిన్ దత్తా శుక్రవారం విధులకు హాజరు కాలేదు. ఆయన సెలవులపై వెళ్లారు.
ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల శుక్రవారం జరగాల్సిన ప్రధాని మోదీ అనర్హత పిటీషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది.
లోక్సభ ఎన్నిలకల ప్రచార కార్యక్రమాల్లో దేవుళ్లు, మతాల పేర్లను విస్తృతంగా వినియోగిస్తోన్నారనే ఆరోపణలను ప్రధాని మోదీ ఎదుర్కొంటున్నారు.
హనుమాన్ చాలీసాను స్వేచ్ఛగా వినే హక్కును కూడా ప్రజలు కోల్పోయారంటూ తన కర్ణాటక ఎన్నికల ప్రచార సభలో మోదీ పేర్కొన్న విషయం తెలిసిందే.
అలాగే ఉత్తరప్రదేశ్లోని ఫిలిభిత్లో ఎన్నికల ప్రచార సభలో దేవుళ్లు- దేవాలయాలు, హిందువులు- హిందూమతం, సిక్కులు- గురుద్వారాల పేర్లతో మోదీ ఎన్నికల్లో ప్రచారం చేశారని, ఇవన్నీ కూడా నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందటూ ఆనంద్ ఎస్ జోంధలే ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేశారు.
అయోధ్యలో రామమందిరం ప్రాణ ప్రతిష్ఠోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తూ శ్రీరామచంద్రుడిని అవమానించిందంటూ ఫిలిభిత్ సభలో మోదీ ఆరోపించారు.
సిక్కులు ప్రసాదంగా వడ్డించే లంగర్పై జీఎస్టీని ఎత్తేస్తామని, కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ను తెరుస్తామంటూ మోదీ మరో సభలో హామీ ఇచ్చారు.
Also Read This Article : అక్రమాస్తుల కేసులో వైఎస్సార్ పేరును చేర్చింది జగనే?
