Khammam :
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత మండవ వెంకటేశ్వర్ రావు పోటీ చేయవచ్చని తెలుస్తోంది. ఆయన పేరును కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలిస్తోందని అంటున్నారు.
రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ స్థానాలకుగాను ఇప్పటికి 14 స్థానల్లో అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. మిగిలిన మూడు స్థానాల విషయంలో తీవ్ర సంక్లిష్టతను ఎదుర్కొంటోంది.
రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున.. ఎంపీ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న ఉద్దేశంతో కాంగ్రెస్ టికెట్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ప్రత్యేకించి ఖమ్మం నుంచి చాలా మంది టికెట్ ఆశిస్తున్నారు.
ఈ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్న నేపథ్యంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కితే ఎంపీగా గెలిచినట్లేనన్న అభిప్రాయాలు నెలకొన్నాయి.
దీంతో టికెట్ కోసం పోటీ తీవ్రంగా మారింది.ఇప్పటికే జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ కుటుంబ సభ్యులకు టికెట్ కావాలని దరఖాస్తు పెట్టుకున్నారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన సతీమణి నందిని కోసం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాదరెడ్డి కోసం, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు యుగంధర్ కోసం దరఖాస్తు చేశారు.
అయితే వీరి అభ్యర్థనను ఏఐసీసీ తిరస్కరించింది. ఎవరి కుటుంబ సభ్యులకూ టికెట్ ఇచ్చేదిలేదని అధిష్ఠానం ఖరాకండిగా చెప్పినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో ఎవరిని బరిలోకి దించాలన్న అంశంపై భారీ కసరత్తే జరిగినట్లు చెబుతున్నారు.
సామాజికవర్గ బలం నేపథ్యంలో..
ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కమ్మ సామాజికవర్గం బలంగా ఉంటుంది.
దీంతో ఇక్కడి నుంచి ఆ సామాజికవర్గానికే టికెట్ ఇవ్వాలన్న అభిప్రాయంతో కాంగ్సెస్ అధిష్ఠానం మొదటి నుంచీ ఉందని సమాచారం.
అయితే ఇక్కడినుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన రేణుకా చౌదరిని ఇప్పటికే రాజ్యసభకు పంపించినందున మరో నేత కోసం అన్వేషిస్తున్నారు.
ఈ క్రమంలో.. నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర రావు పేరు పరిశీలనలోకి వచ్చిందని అంటున్నారు.
నిజామాబాద్ జిల్లాలో కీలక నేతగా ఉన్న మండవ వెంకటేశ్వరరావు డిచ్పల్లి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి పలుమార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.
2009 నుంచి పోటీకి దూరంగా ఉంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని భావించినా.. పొత్తులో భాగంగా ఆ టికెట్ ను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది.
దీంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అదే ఏడాది అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా మండవ వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లి.. ఆయనను బీఆర్ఎస్ లోకి రావాలంటూ ఆహ్వానించారు.
ఆ మేరకు మండవ బీఆర్ఎస్ లో చేరారు. కానీ, ఆయనకు కేసీఆర్ ఎటువంటి రాజకీయ అవకాశాలు కల్పించలేదు. దీంతో 2023 అక్టోబరులో మండవ కాంగ్రెస్ లో చేరారు.
రెండు విధాలుగా కలసివస్తుందనే..
మండవ వెంకటేశ్వర రావును ఖమ్మం బరిలోకి దించితే రెండు విధాలుగా కలిసివస్తుందన్న భావనలో కాంగ్రెస్ ఉంది. పార్లమెంట్ స్థానాల్లో కమ్మ సామాజికవర్గానికి ఒక సీటు కేటాయించినట్లవుతుంది.
అందునా.. సునాయాసంగా గెలిచే సీటు అవుతుంది. దీంతోపాటు మండవకు పట్టున్న నిజామాబాద్ లో పెద్దసంఖ్యలో ఉన్న కమ్మ సామాజికవర్గం ఓటర్లను ప్రసన్నం చేసుకున్నట్లూ అవుతుందని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటోంది.
ఇదే జరిగితే నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్న టి.జీవన్ రెడ్డికి కూడా కలిసివస్తుందని భావిస్తున్నారు. పైగా, ఖమ్మం విషయం తేలితేనే కరీంనగర్ స్థానంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నందున.. మండవనే సరైన నేతగా కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.
Also Read This Article : సినిమాను చంపేసే లాలూచి బ్యాచ్…
