Telangana :
బీఆర్ఎస్ మీటింగ్ కు హాజరైన 106 మంది ఉద్యోగులపై వేటు
సిద్దిపేటలో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. మొత్తం 106 మందిని సస్పెండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 7న సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమభవన్ లో ఉపాధి హామీ, సెర్ఫ్ ఉద్యోగులతో మెదక్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి, మరికొందరు నాయకులు సమావేశం నిర్వహించారు. వెంకట్రామి రెడ్డి గతంలో సిద్దిపేట కలెక్టర్ గా పని చేశారు.
ఆ తర్వాత రిటైర్మెంట్ తీసుకుని బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు ఆయననే మెదక్ లోక్ సభ అభ్యర్థిగా కేసీఆర్ ఎంపిక చేశారు. కాగా, కలెక్టర్ గా పనిచేసిన కాలం నాటి పరపతితో ఆ ప్రాంత ఉద్యోగులతో వెంకట్రామిరెడ్డి సమావేశం నిర్వహించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకుని, సమావేశం ముగిశాక ఫంక్షన్ హాల్ కు తాళం వేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఫంక్షన్ హాల్ కు చేరుకుని అందులోని సీసీ పుటేజ్ ను సేకరించారు. ఫంక్షన్ హాల్లోని వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఫ్లయింగ్ స్వ్కాడ్ ఇంచార్జి పృథ్వి ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సుడా మాజీ చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి లపై కేసు నమోదు చేశారు. ఉద్యోగులపై కలెక్టర్ శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఏకంగా 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో 38 మంది సెర్ఫ్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎపీఎంలు 14, సీసీలు 18 మంది, వీవోలు 4, ఒక్క సీఓ, ఒక సీబీ ఆడిటర్స్ ఉన్నారు. అలాగే 68 మంది ఈజీఎస్ ఉద్యోగులు కూడా సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు.
Also Read This Article : తమ్ముడి కోసం కదిలిన చిరు

Also Read This Article : కుక్కలా మొరుగు.. కోతులను తరుము అలెక్సా..