Delhi Liquor case :
లిక్కర్ స్కాం కేసులో రంగంలోకి దిగినే సీబీఐ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే.. జ్యుడీషియల్ రిమాండ్ ఖైదీగా తీహార్ జైలులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కవితను విచారించేందుకు సీబీఐ కూడా రంగంలోకి దిగింది. కవిత విచారణకు అనుమతి కోరుతూ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో సీబీఐ.. పిటిషన్ కూడా దాఖలు చేసింది. అయితే.. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
కాగా.. గతంలోనూ కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వగా.. ఆమె మాత్రం విచారణకు హాజరుకాలేదు. తాను వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో ఉందని.. అది తేలేవరకు విచారణకు హాజరుకానంటూ సీబీఐకి కవిత సమాధానం ఇచ్చింది. కాగా.. ఇప్పుడు విచారణకు సీబీఐ న్యాయస్థానాన్ని అనుమతి కోరగా.. కేసులో మరింత తీవ్రత పెరగనుంది. ఒకవేళ కోర్టు అనుమతి ఇస్తే.. జైలులోనే కవితను సీబీఐ విచారించనున్నట్టు తెలుస్తోంది.
కవితను విచారించేందుకు అనుమతి కోసం పిటిషన్
అయితే.. ప్రస్తుతం తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కవితను ఈడీ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు.. కవిత తన బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్ 9 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీ కొనసాగనుండగా.. బెయిల్ పిటిషన్పై విచారణ చేసిన న్యాయస్థానం, తీర్పును సోమవారానికి (ఏప్రిల్ 8కు) వాయిదా వేసింది.
బెయిల్ పిటిషన్ సమయంలో.. కవితకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదని.. న్యాయస్థానాన్ని ఈడీ కోరింది. బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని… ఇప్పటికే ఆమెకు వ్యతిరేకంగా అనేక ఆధారాలు ఉన్నాయని ఈడీ వెల్లడించింది. ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని ఆరోపించారు. తాము అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేదని వివరించింది.
మరోవైపు.. తన కుమారుని పరీక్షల కోసం బెయిల్ అడుగుతుండగా.. ఇప్పటికే సగం పరీక్షలు అయిపోయాయంటూ వివరించింది. దీన్ని బట్టి చూస్తే కవితకు బెయిల్ రావటం కష్టంగానే ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇదే సమయంలో.. రంగంలోకి సీబీఐ ఎంటరవుతుండటంతో.. కేసులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయన్నది ఉత్కంఠగా మారింది.
Also Read This Article : కడప పార్లమెంటు బరిలో షర్మిల
