AP Politics :
స్వతంత్ర అభ్యర్థిగా కూటమి తరఫున బరిలోకి రఘురామ
నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు మళ్లీ అక్కడినుంచే ఎంపీగా పోటీ చేయనున్నారా?
ఏ పార్టీ టికెట్ పైనా కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారా?
అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా కూటమి అభ్యర్థిగా మూడు పార్టీల్లో ఏదో ఒక పార్టీ బీఫారంతో తానే నరసాపురం నుంచి పోటీ చేస్తానని రఘురామ మొదటినుంచీ విశ్వాసంగా ఉన్నారు.
ఆ లోక్ సభ స్థానాన్ని కూటమిలో భాగంగా బీజేపీకి కేటాయించడంతో.. ఆ పార్టీ టికెట్ రఘురామకే దక్కుతుందని అందరూ భావించారు. కానీ, చివరికి బీజేపీ ఆయనకు మొండిచెయ్యి చూపించి అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాసవర్మను తమ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ ఎంపిక వెనుక వైసీపీ, సీఎం వైఎస్ జగన్ ఉన్నారని రఘురామ ఆరోపించారు. అయితే తాజాగా ఇక్కడ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు నరసాపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులు రహస్యంగా భేటీ అయ్యారు.
ఈ భేటీలో వారు రఘురామకృష్ణం రాజునే కూటమి అభ్యర్థిగా నరసాపురం ఎంపీ స్థానంలో నిలబెట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు విజ్ణప్తి చేయాలని తీర్మానించారు. ఇలా వారి రహస్య భేటీకి ముందు బీజేపీ అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాసవర్మ నిర్వహించిన ఒక ర్యాలీలో కూడా తెలుగుదేశం, జనసేన శ్రేణులు పాల్గొనలేదు. ఆ ర్యాలీలో కొద్ది మంది బీజేపీ కార్యకర్తలు మాత్రమే పాల్గొనడం స్థానికంగా గుర్తింపు ఉన్న కమలం నేతలు కూడా దూరంగానే ఉండటం గమనార్హం.
ఆ ర్యాలీలో ఎక్కడా తెలుగుదేశం, జనసేన జెండాలు కనిపించకలేదు. దీంతో నరసాపురం ఎంపీ అభ్యర్థిని మార్చకుంటే కూటమి ఐక్యత ప్రశ్నార్ధకంగా మారుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే ఆ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల రహస్య భేటీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది..
స్నేహపూర్వక పోటీగా మిగిలిపోనున్న బీజేపీ అభ్యర్థి?
అయితే వీరి భేటీకి ముందే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు కూడా నరసాపురం ఎంపీ అభ్యర్థిగా అభ్యర్థిగా భూపతి రాజు శ్రీనివాసవర్మ ను నిలబెట్లాలన్న నిర్ణయంపై పునరాలోచించాల్సిందిగా బీజేపీ అధిష్ఠానాన్ని కోరినట్లు తెలుస్తున్నది. మొత్తం మీద కూటమిలోని ప్రధాన పక్షాలైన తెలుగుదేశం, జనసేనలు నరసాపురం విషయంలో బీజేపీ తన నిర్ణయాన్నిమార్చుకోవాలని బలంగా కోరుతున్నాయి.
విస్తృత రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ కంటే బలంగా ఉన్న తాము కొన్ని త్యాగాలు చేశామనీ, మిత్ర ధర్మం ప్రకారం తాము ఒకింత తగ్గి బీజేపీ కోరిన మేరకు ఆ పార్టీకి టికెట్లు కేటాయించామనీ అయితే ఒక్క రఘురామకృష్ణం రాజు విషయంలో బీజేపీ ఎందుకు ఇంత పట్టుదలతో ఉందో అర్ధం కావడం లేదనీ తెలుగుదేశం, జనసేనలు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే నరసాపురం నియోజకవర్గం విషయంలో కూటమి శ్రేణుల ఐక్యత దెబ్బతినకుండా ఓట్ల బదలాయింపు సజావుగా సాగేందుకు మధ్యే మార్గంగా ఒక ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తున్నది.
ఇప్పటికే బీజేపీ అభ్యర్థిని ప్రకటించేసినందున.. రఘురామకృష్ణం రాజుతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయించి కూటమి ఆయనకు మద్దతుగా నిలవాలన్నదే ఆ ప్రతిపాదన. బీజేపీ అధికారిక అభ్యర్థి నామమాత్రంగానే రంగంలో ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయనది ఫ్రెండ్లీ కంటెస్ట్ గా ఉంటుందన్నమాట. అలా జరిగితే మిత్రపక్షాల ఒత్తిడికి తలొగ్గి అభ్యర్థిని మార్చిందన్న విమర్శ నుంచి బీజేపీ బయటపడుతుంది. అలాగే కూటమి పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సజావుగా సాగేందుకు ఎటువంటి ఆటంకం ఉండదు. ఈ ప్రతిపాదనపైనే కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీరియస్ గా చర్చ జరుగిందని, ఈ ప్రతిపాదనకు బీజేపీ హైకమాండ్ కూడా ఓకే చెప్పిందని తెలియవస్తోంది.
Also Read This Article : జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించొద్దు
