Nandamuri Suhasini :
కాంగ్రెస్ లో చేరతారంటూ ప్రచారం
టీడీపీ నాయకురాలు, దివంగత నందమూర హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని శనివారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. తాను మర్యాదపూర్వకంగానే ముఖ్యమంత్రిని కలిశానని సుహాసిని చెప్పారు. అయితే ఈ భేటీపై అప్పుడే ప్రచారం మొదలైంది. సుహాసిని కాంగ్రెస్ లో చేరతారంటూ వార్తలు వస్తున్నాయి. సీఎంను కలిసిన సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ ఉండడం, సుహాసిని వెంట ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కూడా ఉండడంతో కాంగ్రెస్లో చేరాలని ఫిక్స్ అయిన తర్వాతే ఈ భేటీ జరిగిందనే వార్తలు గుప్పుమంటున్నాయి.తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. తెలంగాణలో తెలుగుదేశం కాస్తో కూస్తో ఉందన్నా.. మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటి వరకూ ఇలా ఉందన్నా ఇందుకు సుహాసినీ వల్లనే అని పార్టీ శ్రేణులు చెప్పుకుంటూ ఉంటాయి. అయితే ఈమె కూడా పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని తాజా సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సుహాసిని పార్టీలో చేరితే కీలక పదవి కూడా ఇవ్వడానికి కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధంగా ఉన్నట్లు తెలియవచ్చింది.
పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 14 నుంచి 15 సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్.. ఆయా పార్లమెంట్ పరిధిలో ఎవరు పార్టీలోకి రావడానికి ముందుకొచ్చినా సరే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కండువాలు కప్పేయడం జరుగుతోంది. ఇందులో భాగంగానే.. కూకట్పల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్లో పరిధిలో మంచి ఫాలోయింగ్ ఉన్న సుహాసినీని పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆమెకు పిలుపు రావడం.. సీఎం ఇంటికి వెళ్లడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయట.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కాంగ్రెస్లో చేరిన తర్వాత సుహాసినికి కీలక పదవి ఇవ్వాలని అధిష్టానం భావిస్తోందట.
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియవచ్చింది. 2018 ఎన్నికల్లో టీడీపీ తరఫున కూకట్పల్లి నియోజకవర్గం నుంచి పోటీచేసిన సుహాసిని బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చారు. 70,563 ఓట్లు దక్కించుకున్న ఆమె.. ఆ తర్వాత పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు కష్టపడ్డారు. తెలంగాణలో టీడీపీకి పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సుహాసిని రంగం సిద్ధం చేసుకున్నారట. ఇందులో నిజమెంతో సుహాసినియే స్వయంగా ప్రకటిస్తేగానీ నిర్ధారణ అయ్యే అవకాశం లేదు.
Also Read This Article : సికింద్రాబాద్ ఎంపీ పోటీ నుంచి దానం నాగేందర్ ఔట్?
