Election Commission :
చివరి దశ పోలింగ్ అయ్యేదాకా నిషేధం విధించిన ఎన్నికల కమిషన్
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకూ ఎటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించకూడంటూ నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే.
దీంతో ఇప్పటికే బరిలో నిలిచే అభ్యర్థులపై ఒక క్లారిటీకి వచ్చిన ప్రధాన పార్టీలు.. ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజిగా ఉన్నాయి. ప్రస్తుతం ఏ మూల చూసినా ఇలాంటి సందడే కనిపిస్తుంది. మరోవైపు పలు సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రధానంగా లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన సర్వేలు వైరల్ గా మారుతున్నాయి.
ఏ రాజకీయ పార్టీ ముందుంది, ఏ అభ్యర్ధికి ప్రజల్లో ఆదరణ ఉందన్న దానిపై సర్వేలు, ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ నిర్వహణలో ఏజెన్సీలు తలమునకలై ఉన్నాయి. దీంతో నిత్యం ఎన్నో సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలపై ఇప్పటివరకూ ఎన్నో సర్వేలు వచ్చేశాయి.కొన్ని ఏజెన్సీలు నిర్వహించే సర్వే ఫలితాలు… తర్వాత రాబోయే వాస్తవ ఫలితాలకు చాలా దగ్గరగా ఉంటుండగా.. మరికొన్ని మాత్రం పూర్తి వ్యతిరేకంగా ఉంటుంటాయి. దీంతో… వీరికి అంచనా వేయడం రాలేదా.. లేక, వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని సర్వేల పేరుతో జనాలపై రుద్దే ప్రయత్నం చేశారా అనే సందేహం కూడా కలుగుతుంటుంది.
అయితే సాధారణ సర్వేలు, ఒపీనియన్ పోల్స్ కూ, ఎగ్జిట్ పోల్స్ కూ వ్యత్యాసం ఉంది. ఎన్నికలకు ముందు ఒపీనియన్ పోల్స్, సర్వేలు నిర్వహిస్తారు. కానీ ఎగ్జిట్ పోల్స్ అలా కాదు. ఎన్నికల్లో జనం ఎవరికి ఓటు వేశారో తెలుసుకుని వాటి ఆధారంగా విజేతలను ప్రకటించడానికి ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తారు.ఇలా నిర్వహించే ఎగ్జిట్ పోల్స్ సాధారణంగా ఎన్నికల తంతు ముగిశాక వెల్లడవుతాయి. ఆలోపు వెల్లడయ్యే అవకాశం లేదు.
కానీ ఇదంతా ఓ దశలోనే సాగిపోయే ఎన్నికలకు. కానీ ఇప్పుడు దేశంలో ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ఫలితాల వెల్లడితో సమస్యలు ఎదురవుతాయి.ఎన్నికల్లో జనం ఎవరికి ఓటు వేశారు అని తెలుసుకుని.. వాటి ఆధారంగా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటమిపాలవుతారు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది వంటి విషయాలను వెల్లడిస్తుంటారు.! ఈ నేపథ్యంలో.. ఓ దశ ఎన్నికల తర్వాత దాని ఎగ్జిట్ పోల్ విడుదల చేస్తే దాని ప్రభావం మిగతా దశల్లో జరిగే ఎన్నికలపై పడుతుంది.
అందుకే ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ అంటే ఏడు దశలూ ముగిసిన తర్వాతే ఎగ్జిట్ పోల్స్ నిర్వహించేలా ఈసీ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల ప్రక్రియలో తొలి దశ పోలింగ్ జరిగే ఏప్రిల్ 19 నుంచి చివరి దశ పోలింగ్ జరిగే జూన్ 1 వరకూ ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకుండా ఈసీ నిషేధం విధించింది. అంటే జూన్ 1 సాయంత్రం ఏడో దశ పోలింగ్ ముగిశాక మాత్రమే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేందుకు వీలుంటుంది.
Also Read This Article : సీఎం రేవంత్ ను కలిసిన నందమూరి సుహాసిని
