BRS KCR :
కాంగ్రెస్, బీజేపీ దూకుడుతో బీఆర్ఎస్ విలవిల
ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి. ఈ సామెత ఇప్పుడు బీఆర్ఎస్ కు సరిగ్గా సరిపోతుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు బలమైన రాజకీయ శక్తిగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు దాదాపు దయనీయమైన స్థితికి చేరుకుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పార్టీని ఢీకొట్టడమంటే సాధారణమైన విషయంగా ఉండేదికాదు. కానీ కేవలం మూడు నెలల్లోనే సీన్ మొత్తం రివర్స్ అయింది.అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అధినేత నమ్ముకున్న వ్యక్తులే పార్టీని వీడి ఇతర పార్టీలో చేరిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపించే వాళ్లంతా.. ప్రస్తుతం ఎప్పుడు పార్టీ వీడి వెళ్లిపోదామా.? అని ఆలోచిస్తున్న పరిస్థితి నెలకొంది.
ఓవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆడుతున్న పొలిటికల్ గేమ్లో ఇరుక్కున్న కారు పార్టీ.. బయటకు ఎలా రావాలో తెలియక విలవిల్లాడుతోంది. గత కేసీఆర్ పాలనలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణలు ఓవైపు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ కావడంతో బీఆర్ఎస్ అగ్రనాయకత్వమంతా వాటిపైనే దృష్టి పెట్టాల్సివస్తోంది.ఫలితంగా పార్టీ గురించి పూర్తి స్థాయిలో ఆలోచించలేని స్థితిలో ఉంది. దీంతో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ భజన చేసిన నాయకులు.. ప్రస్తుతం ఆ పార్టీని వీడి బీజేపీ, కాంగ్రెస్లో చేరిపోతున్నారు. ఐదేళ్లపాటు బీఆర్ఎస్కు మళ్లీ అధికారం వచ్చే అవకాశం ఎలాగూ లేనందున.. ఆ తర్వాత రాజకీయం ఎలా ఉంటుందోనని.. నాయకులంతా సేఫ్ జోన్ కోసం అధికారంలో ఉన్న పార్టీల్లో చేరిపోతున్నారు.
ఈ పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక బీఆర్ఎస్కు కష్టంగా మారింది. గతంలో బీఆర్ఎస్ టికెట్ కోసం పోటీపడే పరిస్థితి నుంచి.. ప్లీజ్ ఎన్నికల్లో పోటీ చేయండనే స్థాయికి చేరుకుంది. కొంతమంది సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ పార్టీ టికెట్ ఇస్తుందని తెలిసినా.. ఇక్కడ ఉంటే గెలవలేమనే అంచనాతో.. ఎన్నికలకు ముందే బీజేపీ, కాంగ్రెస్లో చేరి టికెట్లు తెచ్చుకున్నారు.జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ నగేష్ బీజేపీలోకి వెళ్లారు. బీబీ పాటిల్, నగేష్కు బీజేపీ ఎంపీ టికెట్లు ఇచ్చింది. రాములు స్థానంలో ఆయన కుమారుడు భరత్ ప్రసాద్కు నాగర్ కర్నూలు స్థానాన్ని కేటాయించింది. మరోవైపు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరి ఎంపీ టికెట్లు కన్ఫర్మ్ చేసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ క్రమంగా బలహీనపడుతూ వస్తోంది.
పవర్ ఉన్న చోట ఉంటేనే మేలని..
ప్రస్తుత రాజకీయాల్లో ప్రజాబలం కంటే ధన బలాన్నే రాజకీయపార్టీలు నమ్ముతున్నాయి. దీంతో ఆర్థికంగా స్థితిమంతులైన వ్యక్తుల్ని పార్టీలో చేర్చుకుంటోంది. భవిష్యత్తులో పార్టీ కోసం ఖర్చు పెట్టగలరని భావిస్తే పిలిచి కండువా కప్పేస్తున్నారు అధికార పార్టీ నాయకులు. పవర్ ఉన్న వాళ్ల దగ్గరుంటే.. తమ వ్యాపారాలకు, దందాలకు అడ్డూ అదుపూ ఉండదని భావిస్తున్న నేతలు పార్టీ ఫిరాయించేందుకు వెనుకాడటం లేదు.అధికారం అనే నాలుగు అక్షరాలు ఉంటే చాలు.. మనం ఏం చేసినా చెల్లుతుందనే భావనకు రాజకీయ నాయకులు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా లోక్సభ ఎన్నికల ఫైట్ మారింది. బీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని.. రెండు నుంచి మూడు స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వగలిగినా.. ఎన్ని గెలుస్తుందనే విషయంలో ఆ పార్టీకే స్పష్టత లేనట్లు తెలుస్తోంది.
లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపించలేకపోతే.. తెలంగాణలో ఆ పార్టీ మరింత బలహీనడే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ను బలహీనర్చడమే టార్గెట్గా బీజేపీ పని చేస్తోంది. ఆ పార్టీ ప్లేస్ను తాము ఆక్రమిస్తే.. తెలంగాణ రాజకీయాన్ని కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మార్చాలనే ప్లాన్లో కమలనాధులు ఉన్నట్లు తెలుస్తోంది.అలా చేస్తే కాంగ్రెస్, బీజేపీ ఫైట్లో హస్తం పార్టీని ఓడించడం కమలం పార్టీకి సులువైన పనిగా గత అనుభవాలు చూస్తే అర్థమవుతుంది. ప్రాంతీయ పార్టీల ప్రభావం ఉన్న రాష్ట్రాలు మినహాయిస్తే బీజేపీ, కాంగ్రెస్ మధ్య డైరెక్ట్ ఫైట్ ఉన్న రాష్ట్రాల్లో కాషాయ పార్టీదే పైచేయిగా కనిపిస్తోంది. దీంతో బీఆర్ఎస్ను ఖతమ్ చేయడమే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.మరి అధికారంలో ఉన్నన్నాళ్లూ అపర చాణక్యుడిగా, రాజకీయ గండర గండడుగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ తన చాణక్యాన్ని మరోసారి ప్రదర్శిస్తారా? లేక ఈ పరిణామాలను ప్రేక్షకుడిగా చేష్టలుడిగి చూస్తుండిపోతారా? అన్నది కాలమే నిర్ణయించనుంది.
Also Read this Article : ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కొత్త విషయాలు..!