Sub-Registrar Taslima : సేవ ముసుగులో ప్రచారం.. అవినీతే మార్గం

Sub-Registrar Taslima :

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

ఆమె ఒక సబ్ రిజిస్ట్రార్. ఉన్నతోద్యోగం అయినప్పటికీ.. దానికి అతీతంగా మరోరూపంలో ప్రజా సేవ చేయాలనుకున్నారు. ప్రభుత్వ సెలవులు వస్తే చాలు మహిళలతో కలిసి నాట్లు వేయడం, పత్తి ఏరడం, మిర్చి తెంపడం వంటి కార్యక్రమాలు చేసేవారు. కార్యాలయానికి వచ్చే సమయంలో ఆటో, బస్సు, ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించేవారు.

అంతేకాదు.. ఒక ట్రస్ట్‌ ఏర్పాటు చేసి అనాథ పిల్లలకు దుస్తులు పంపిణీ చేయడం, ఎవరైనా మరణిస్తే వారి ఇంటికి వెళ్లి 25 కిలోల బియ్యం బస్తా, నగదు ఇచ్చేవారు. దీంతో అంతా ఆమె సేవాగుణాన్ని చూసి అచ్చెరువొందేవారు. ఎంతో మంది ఆమెపై ప్రశంసలు కురిపించేవారు.

కానీ, ఇవన్నీ ప్రచారం కోసమే చేశారని, ఆయా సందర్భాల్లో ఫొటోలు తీసుకొని.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ప్రచారం పొందేవారని తాజాగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా అవినీతికి పాల్పడుతూ.. సేవ ముసుగులో తనపై ఎవరికీ సందేహం రాకుండా వ్యవహరించిందని అంటున్నారు.

ఆమే.. మహబూబాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ మహమ్మద్‌ తస్లీమా. లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీశ్‌ తన 128 గజాల స్థలానికి రిజిస్ట్రేషన్‌ కోసం ఈనెల మొదటి వారంలో సబ్‌ రిజిస్ట్రార్‌ తస్లీమా మహ్మద్‌ను సంప్రదించాడు.

ఆమె సూచన మేరకు కార్యాలయ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ఆలేటి వెంకటేశ్‌ను కలువగా.. ప్రభుత్వ ధర ప్రకారం గజానికి రూ.100 ఉంటుందని, కానీ ఇక్కడ మాత్రం గజానికి రూ.200 చొప్పున ఇస్తేనే రిజిస్ట్రేషన్‌ చేస్తామని వెంకటేశ్‌ చెప్పాడు. దీంతో హరీశ్‌ మళ్లీ సబ్‌ రిజిస్ట్రార్‌ను కలిశాడు. మొత్తం రూ.19,200 ఇస్తేనే రిజిస్ట్రేషన్‌ చేస్తామని చెప్పింది.

వెంటనే ఆయన వరంగల్‌ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఒప్పందంలో భాగంగా హరీశ్‌ శుక్రవారం కార్యాలయానికి వెళ్లి సబ్‌ రిజిస్ట్రార్‌ తస్లీమాకు డబ్బులు ఇవ్వబోయాడు. ఆఫీస్‌లో పనిచేసే వెంకటేశ్‌కు ఇవ్వాలని ఆమె సూచించడంతో బాధితుడు హరీశ్‌ రూ.19,200ను వెంకటేశ్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

వెంకటేశ్‌ వద్ద రూ.19,200లతోపాటు అదనంగా 1.72 లక్షలు లభించాయి. అదనపు డబ్బులు ఎవరి నుంచి తీసుకున్నాడనే వివరాలు ఇంకా తెలియరాలేదు. కార్యాలయంలో సోదాలు కూడా నిర్వహించారు. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సబ్‌ రిజిస్ట్రార్‌ తస్లీమాతోపాటు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి వెంకటేశ్‌పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్టు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.

ఏసీబీ రైడ్స్ తో కలకలం

తస్లీమా మహమ్మద్ ఇదివరకు ములుగు సబ్ రిజిస్ట్రార్ గా పని చేశారు. అక్కడ పని చేస్తున్న సమయంలో ఆమె మంచి పేరు సంపాదించారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తిస్తారనే పేరు కూడా ఆమెకు ఉంది.

ఓ వైపు సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వర్తిస్తూనే పొలం పనులు చేస్తూ ఉండేది. దీంతో ఆమె పొలం పనులు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండేవి. ఇన్నిరోజులు సైలెంట్ గా ఉన్న తస్లీమా మహమ్మద్ ఒక్కసారిగా ఏసీబీ అధికారులకు చిక్కడం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశమైంది.

కాగా ఇన్నిరోజులు ఎలాంటి రిమార్క్ లేకుండా పని చేసిన తస్లీమా ఈ ఒక్క ఘటనతో తన పేరును మొత్తం పోగొట్టుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదిలాఉంటే ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ ఆఫీసర్లు ములుగులో పని చేసిన సమయంలో ఏమైనా అక్రమాలకు పాల్పడిందా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. మరి విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి.

 

Also Read This Article : మలేషియాలో టాలీవుడ్ వేడుక

 

Raj Arjun Exclusive Interview
Raj Arjun Exclusive Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *