Lok Sabha Elections :
తెలంగాణలో జోరుగా ఫిరాయింపులు
పార్లమెంటు ఎన్నికలు తెలంగాణలో విచిత్రమైన పరిస్థితిని తీసుకొచ్చాయి. ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటాడో, ఎప్పుడు పార్టీ మారుతాడో, ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో తెలియని పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం దాకా ఒక పార్టీ తరఫున ప్రచారం చేసిన నాయకుడు.. సాయంత్రానికి మరో పార్టీలో చేరిపోతున్నారు.ఇదేదో చిన్నా చితకా కార్యకర్తలు కాదు. ఏకంగా అసెంబ్లీ నియోజకవర్గం, లోక్ సభ నియోజకవర్గం స్థాయి నాయకులే ఇలా ప్రవర్తిస్తున్నారు.
నిన్నమొన్నటి దాకా నాయకులతో ‘కారు’ ఓవర్ లోడ్ అయి.. నేనంటే నేను పోటీ చేస్తానని, టికెట్ నాకే కావాలని పెద్దసంఖ్యలో నేతలు పోటీ పడిన పరిస్థితి బీఆర్ఎస్ లో ఉండేది.అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిపాలై అధికారం కోల్పోవడంతో ఒక్కసారిగా వ్యవహారం తలకిందులైంది. చివరికి పార్లమెంటు ఎన్నికల్లో సిటింగ్ ఎంపీలుగా ఉన్నవారు కూడా ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి విముఖత చూపే పరిస్థితి వచ్చింది. దీంతో టికెట్ కోసం నేతలు పోటీ పడిన పార్టీ.. చివరికి అభ్యర్థులను వెతుక్కునే దాకా వచ్చింది.
కాంగ్రెస్ నాయకత్వం కూడా వారికే…
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గినా.. పార్లమెంటు ఎన్నికల బరిలో నిలిచేందుకు సమర్థులైన అభ్యర్థులు ఆ పార్టీలో లేరు. టికెట్ల కోసం చాలామంది పోటీపడుతున్నా.. వారిలో గెలవగలిగే వారు తక్కువేనన్న అభిప్రాయాలున్నాయి. దీంతో సొంత పార్టీ వారిని కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి కాంగ్రెస్ ప్రాధాన్యమిస్తోంది.ఈ క్రమంలో బీఆర్ఎస్ కు చెందిన నేతలను ఆకర్షించే పనిలో పడింది. అందుకు తగ్గట్టుగానే పలువురు నేతలు గులాబీ కండువాను తొలగించి.. కాంగ్రెస్ కండువా కప్పుకొంటున్నారు. టికెట్లు ఖాయం చేసుకొని మరీ.. హస్తం గూటికి చేరుతున్నారు. కాంగ్రెస్ నాయకత్వం కూడా వారికే టికెట్లు ఇస్తోంది.చేవెళ్ల నుంచి ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకొని టికెట్ ఖరారు చేసింది.
మరోవైపు రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించుతోంది. ఇక మరో అనూహ్యమైన పరిణామం బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో జరిగింది.ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న దానం.. కాంగ్రెస్ లో చేరడం, ఆయనను సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ నిర్ణయించడం జరిగిపోయాయి. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ విషయంలోనూ ఇదే జరిగింది.వీరే కాకుండా కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజెకవర్గం నుంచి ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేశ్ ను కూడా కాంగ్రెస్ లో చేర్చుకుంది. రానున్న ఉప ఎన్నికల్లో ఆయనకే టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఎప్పుడు ఏ నేత మెడలో, ఏ జెండా ఉంటుందో
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో అంతగా పట్టులేని బీజేపీ కూడా వలస నేతలకే పెద్దపీట వేస్తోంది. సీతారాం నాయక్, గోడెం నగేశ్, గోమాస శ్రీనివాస్, శానంపూడి సైదిరెడ్డి.. ఇలా పెద్దసంఖ్యలో నేతలను ఇతర పార్టీల నుంచి తీసుకొని టికెట్లు ఇస్తోంది. దీంతో నిన్నటిదాకా ఒక పార్టీలో ఉండి..ఇతర పార్టీలపై విమర్శలు చేసిన నేతలను ఇప్పుడు అవే పార్టీల కండువాలతో చూసి జనం నివ్వెరపోతున్నారు. ఏ నేత మెడలో ఎప్పుడు, ఏ జెండా ఉంటుందోనని నవ్వుకుంటున్నారు.అసెంబ్లీ ఎన్నికలతోపాటే పార్లమెంటు ఎన్నికలు జరిగి ఉంటే.. పరిస్థితి ఇలా ఉండేది కాదని, ఇంతగా ఫిరాయింపులు జరిగేవి కావని అభిప్రాయపడుతున్నారు.
కానీ, 2018లో నాటి సీఎం కేసీఆర్.. తెలివైన ఎత్తుగడగా భావించి ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడమే ఇందుకు కారణమని అంటున్నారు. ఆ రోజు ఆ నిర్ణయం వల్ల కేసీఆర్ రెండోసారి అధికారంలోకి రావడంతో వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ లబ్ధి పొందగలిగారు. ఇప్పుడు అదే ఆయనకు రివర్స్ అయి.. పార్టీని దెబ్బ తీస్తోందని విశ్లేషిస్తున్నారు.
Also Read This Article : నాటి బద్ధ విరోధులే.. నేటి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు..
