2024 Ap Elections :
గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు ఏపీలో రాజకీయం మొత్తం మారిపోయింది… 2019లో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ వేటికవే సొంతంగా పోటీ పడ్డాయి. ఇప్పుడు కూడా వైసీపీ సొంతంగానే బరిలో దిగుతోంది. టీడీపీ-జనసేన సీట్ల పంపకం కూడా చేసుకున్నాయి. బీజేపీ ఎప్పుడు కలిసి వస్తుందా? అని చూస్తున్నాయి. ఆ పార్టీకి ఇచ్చే సీట్లపై ఇప్పటికే ఓ అవగాహనతో ఉన్నాయి.
సరిగ్గా గత శనివారం టీడీపీ-జనసేన కూటమి మధ్య సీట్ల షేరింగ్ వెల్లడైంది. ఇందులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించింది. టీడీపీ 94 స్థానాలకు అదే సమయంలో అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీకి ఎన్ని అసెంబ్లీ సీట్లు ఇస్తారో వెల్లడి కావాల్సి ఉంది. అయితే, అవి ఏక సంఖ్యలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ కంటే పార్లమెంటు సీట్లపైనే బీజేపీ ఎక్కువ ఫోకస్ పెట్టిందని చెబుతున్నారు.
గెలిస్తే ఇలా..
ఏపీలో మొత్తం సీట్లు 175. ఇందులో గత ఎన్నికల్లో వైసీపీ 151 గెలిచింది. ఈసారి 175కి 175 అంటోంది. ఆ సంగతి పక్కనపెడితే టీడీపీ-జనసేన పొత్తులో ఇప్పటికే మెజారిటీ (99) సీట్లకు అభ్యర్థులను ప్రకటించినట్లైంది. మిగిలింది 76 మాత్రమే. వాటిలోనూ బీజేపీకి గరిష్ఠంగా 6సీట్లు ఇస్తారని అనుకుంటే 70 సీట్లకు అభ్యర్థులను వెల్లడించాల్సి ఉంది. ఇందులో 19 జనసేనవి. 51 సీట్లు నికరంగా టీడీపీవి. అంటే.. తెలుగుదేశం నేరుగా 145 సీట్లలో పోటీ చేస్తున్నట్లు.
మెజారిటీ మార్క్ కు..
ఏపీలోని 175 సీట్లకు గాను సాధారణ మెజారిటీ 88. అటు వైసీసీ అయినా, ఇటు టీడీపీ అయినా 88 స్థానాలు సాధిస్తే నేరుగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి. పోటీ చేసే స్థానాలే తక్కువ కాబట్టి జనసేన, బీజేపీకి ఎలాగూ అన్ని సీట్లు రావు. ఇక టీడీపీ పొత్తులో వదులుకున్నవి పోగా టీడీపీ 145 సీట్లలోనే 88 సాధించాలి. ఎలాగూ మెజారిటీ సీట్లు సాధిస్తే జనసేన-టీడీపీ కూటమినే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అలాకాకుండా తామూ మెజారిటీ స్థానాలు గెలిచామని చెప్పేందుకు మాత్రం కనీసం 61 శాతం (88) సీట్లు నెగ్గాలి. అంటే పోటీ చేసే ప్రతి మూడింటిలో రెండింటిని కచ్చితంగా కైవసం చేసుకోవాలి.
Also Read This : మెడలో ఢిల్లీ స్కాం.. ఆ వైసీపీ మాజీ ఎంపీ కుటుంబానికి టికెట్ ఎలా..?
