Magunta Srinivasulu :
ఆయన కుటుంబానిది 40 ఏళ్లకు పైగా రాజకీయ చరిత్ర. ఉమ్మడి ఏపీలోనే కీలకంగా నిలిచినవారు. ఆ తర్వాత సైతం రాజకీయాల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా కొనసాగారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీతో (Congress Party )అనుంబంధం కొనసాగించారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో.. వచ్చే ఎన్నికల్లోనూ ఆయన కుటుంబానికి టికెట్ ఖాయం అనుకుంటుండగా రాజకీయం తారుమారైంది. ఇదంతా ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి( Mp Magunta Srinivasulu Reddy ) గురించి.
శ్రీనివాసులరెడ్డిది నాలుగుసార్లు గెలిచిన చరిత్ర. ఆ కుటుంబం 33 ఏళ్లలో ఎనిమిదిసార్లు పార్లమెంట్, రెండుసార్లు శాసనసభ, ఒకసారి శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసింది. శ్రీనివాసులరెడ్డి సోదరుడు మాగుంట సుబ్బరామిరెడ్డి 1991లోనే ఒంగోలు ఎంపీగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. అయితే.. ఆయన మావోయిస్టుల చేతిలో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత సుబ్బరామిరెడ్డి భార్య పార్వతమ్మ 1996లో ఎంపీగా గెలిచారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు.
1998, 2004, 2009 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా కాంగ్రెస్ తరపున గెలిచారు. 1999లోనూ కాంగ్రెస్ నుంచి బరిలో దిగినా ఓడిపోయారు. ఇక 2014లో ఉమ్మడి ఏపీ విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుధేశంలో చేరారు. ఒంగోలు ఎంపీగా పోటీ చేసి వైవీ సుబ్బారెడ్డి చేతిలో ఓడారు. 2015లో ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల తరుపున శాసనమండలి సభ్యునిగా గెలుపొందారు.
సరిగ్గా గత ఎన్నికల ముందు
గమనార్హం ఏమంటే.. సరిగ్గా ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసినట్లే గత ఎన్నికల ముంగిట మాగుంట శ్రీనువాసులు రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. 2019 మార్చి 16న వైసీపీలో లో చేరారు. ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. ఐదేళ్లు తిరగకుండానే.. గత నెల రి 28న వైసీపీ నుంచి వైదొలగారు. అంటే.. రాజకీయ కారణాలు ఏమున్నా.. ఐదేళ్లలో రెండోసారి పార్టీని వీడారు. ఇప్పుడు మరి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది చూడాలి.
ఢిల్లీ మద్యం స్కాం…
మూడేళ్లుగా ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలను వెంటాడుతున్న కేసు.. ఢిల్లీ మద్యం విధానం స్కాం. ఈ ఒక్క కేసులోనే ఈడీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఏడుసార్లు నోటీసులు జారీచేసింది. మొన్నటివరకు తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనూ మరోసారి విచారణకు పిలుస్తోంది. దీన్నిబట్టే ఢిల్లీ లిక్కర్ స్కాం తీవ్రత తెలుస్తోంది. అలాంటి స్కాంలో ఒంగోలు ఎంపీ శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డి పేరు వినిపించింది. సీబీఐ, ఈడీ రంగప్రవేశంతో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఎక్కడికో వెళ్లిపోయింది.
ఇప్పుడు శ్రీనివాసులరెడ్డి వైసీపీని వీడారు. ఆయన ఆ పార్టీలో ఉండగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీడీపీ తీవ్రంగా విమర్శించింది. మరి ఇప్పుడు శ్రీనివాసులరెడ్డి బయటకు వచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీలో చేరుతారా? పోటీ చేయకుండా దూరంగా ఉంటారా? ఒకవేళ టీడీపీ ఆయనను చేర్చుకుంటే ఏమని సమాధానం చెబుతుంది..? అనేది ఆసక్తికరం.
కొసమెరుపు: ఇదే శ్రినివాసులరెడ్డి కుటుంబానికి చెందిన ‘ఉదయం’ పత్రిక మూతపడేలా చేసింది టీడీపీ మీడియా. అయితే, తర్వాత శ్రీనివాసులరెడ్డి టీడీపీలోకి వెళ్లారు. ఎంపీగా ఓడి ఎమ్మెల్సీగా గెలిచారు.
Also Read This Article : AP Elections:నాటి బద్ధ విరోధులే.. నేటి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు..
