Ranji Trophy News:
క్రికెట్ లో సెంచరీలు చేసేందుకు ఓపెనర్లకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.. తర్వాత వంతు వన్ డౌన్ బ్యాట్స్ మన్. జట్టులోని నంబర్ వన్ బ్యాట్స్ మన్ మాత్రమే ఈ స్థానంలో వస్తాడని అంటారు. ఇక మిడిలార్డర్ లోనివారికి సెంచరీలు చేసే చాన్స్ కాస్త తక్కువే. మొదట్లోనే వికెట్లు పడి.. ఓవర్లు ఎక్కువంగా ఉన్న సందర్భాల్లో మాత్రమే వీరికి మూడంకెల స్కోరుకు వీలుంటుంది. సుదీర్ఘ ఫార్మాట్ కాబట్టి టెస్టుల్లో మాత్రం మిడిలార్డర్ వారు సెంచరీలు కొట్టొచ్చు. వన్డేల్లో కాస్త కష్టమే అయినా.. అవకాశం ఉంటుంది. టి20ల్లో మాత్రం సూర్యకుమార్ లాంటి వారికే సాధ్యం. అయితే, ఓ జట్టులో పదో నంబరు, పదకొండో నంబరు ఆటగాళ్లు సెంచరీలు చేశారంటే నమ్మశక్యమా?
ముంబై బ్యాట్స్ మన్ మహా ఇన్నింగ్స్
రంజీట్రోఫీ.. భారత దేశవాళీ క్రికెట్ టోర్నీ. ఇక్కడినుంచే జాతీయ జట్టుకు ఎంపికలుంటాయి. మరీ ముఖ్యంగా టెస్టుల్లోకి. అలాంటి రంజీ ట్రోఫీలో ముంబైది చెరగని రికార్డు. ఇప్పటివరకు 41 సార్లు గెలుచుకుంది ముంబై జట్టు. సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్ సహా ఎంతోమంది మేటి ఆటగాళ్లను దేశానికి అందించింది. అయితే, కొంతకాలంగా మాత్రం రంజీల్లో ముంబై వెనుకబడింది. 2015-16 సీజన్ తర్వాత మళ్లీ రంజీ టైటిల్ కొట్టలేదు. గొప్ప ఆటగాళ్లు రిటైర్ కావడం, కురారళ్లు ఆశించినంత రాణించకపోవడంతో వెనుకబడింది. అలాంటి ముంబై ఈ సీజన్ లో కాస్త బలంగా కనిపిస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ అజింక్య రహానే సారథ్యంలో నిలకడగా ఆడుతోంది. బరోడాతో తాజాగా జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు 10, 11 నంబరు బ్యాట్స్ మెన్ రికార్డు నెలకొల్పారు.
యువ ఆల్ రౌండర్ ముషీర్ ఖాన్ అజేయ డబుల్ సెంచరీ (203)తో బరోడాతో మ్యాచ్ లో ముంబై తొలి ఇన్నింగ్స్ లో 384 పరుగులు చేసింది. ప్రతిగా బరోడా 348 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ లో ముంబై ప్రధాన బ్యాట్స్ మెన్ తడబడ్డారు. ఆ జట్టు 337 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. అయితే, ఇక్కడినుంచే అసలు మ్యాచ్ మొదలైంది. ముంబై 10 నంబరు బ్యాట్స్ మన్ థనుష్ కొటైన్ (129 బంతుల్లో 120, 10 ఫోర్లు, 4 సిక్సులు), తుషార్ దేశ్ పాండే (129 బంతుల్లో 123, 10 ఫోర్లు, 8 సిక్స్ లు) ధాటిగా ఆడి ఏకంగా సెంచరీలు కొట్టారు. పదో వికెట్ కు ఏకంగా 232 పరుగులు జోడించారు. దీంతో ముంబై రెండో ఇన్నింగ్స్ లో 569 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్ లో ముంబై ఓపెనర్ హార్దిక్ తమోరో తర్వాత సెంచరీ చేసింది వీరిద్దరే.
Also Read:AP Political News:24-24-24 జనసేన తొలి లిస్ట్ లో విశేషం.