సోషల్ మీడియాలో ద్వేషాన్ని ఎదుర్కోవడం హీరో విజయ్ దేవరకొండకు కొత్త కాదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న విజయ్ అంటే చాలా మందికి అసూయ. ఆ ద్వేషంతోనే సోషల్ మీడియాలో ఆయన సినిమాలపై, ఆయన వ్యక్తిగత విషయాలపై తప్పుడు పోస్టులు చేస్తుంటారు. తాజాగా ఇలాంటి దుశ్చర్యలకే పాల్పడుతున్నారు కొందరు నెటిజన్స్.
తన కొత్త సినిమా రణబాలి షూటింగ్ లో విజయ్ దేవరకొండ ప్రొడ్యూసర్స్ కు ప్రొడక్షన్ భారం పెరిగేలా చేస్తున్నాడంటూ ఫేక్ న్యూస్ పోస్టులు చేస్తున్నారు. విజయ్ 50, 60 మంది అసిస్టెంట్స్ కావాలని, 5-6 కార్వాన్స్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాడని, ఆయన డిమాండ్స్ భరించలేక మైత్రీ సంస్థ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేసిందంటూ తప్పుడు పోస్టులు చేస్తున్నారు. ఈ వార్తలు టైమ్స్ ఆఫ్ ఇండియా, వే 2 ఎస్ఎంఎస్, 123 తెలుగు.కామ్ వంటి పేరున్న వైబ్ సైట్స్ రాసినట్లు క్రియేట్ చేసి, ఆయా సంస్థల పేర్లు, లోగోలు ఫోర్జరీ చేసి పోస్టులు చేస్తున్నారు. దీంతో ఇవన్నీ నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
అసూయతో కొందరు కొందరు నెటిజన్స్, ఫ్యాన్స్ ఇలా దిగజారి సోషల్ మీడియాలో వ్యవహరించడాన్ని విజయ్ దేవరకొండ టీమ్ ఖండించింది. ఈ అసత్య వార్తలు నమ్మవద్దని ప్రేక్షకుల్ని కోరింది. విజయ్ ఎప్పుడూ ప్రొడ్యూసర్స్ మంచిని కోరే హీరోగానే ఉన్నాడని, ఉంటాడని వెల్లడించింది. ఈ ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి పోస్టులు చేస్తున్న వారిపై తమ సంస్థల పేర్లు, లోగోలు ఫోర్జరీ చేస్తున్నందుకు టైమ్స్ ఆఫ్ ఇండియా, 123 తెలుగు.కామ్, వే 2 ఎస్ఎంఎస్ వంటి సంస్థలతో పాటు సైబర్ క్రైమ్ శాఖ చర్యలు తీసుకుని చట్టపరంగా శిక్షించాలని విజయ్ టీమ్ కోరింది.